ఏపీకి కొత్త ఎస్ఈసీ… హైకోర్టులో కేసు

by  |
ఏపీకి కొత్త ఎస్ఈసీ… హైకోర్టులో కేసు
X

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) వచ్చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై వేటు వేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజును నియమించింది. ఈ ఉదయమే విజయవాడలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ నిన్న ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా ఆర్డినెన్స్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసినట్టు అయింది. ఆయన గత నాలుగేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో రమేశ్ కుమార్ పదవీ కాలం అర్థాంతరంగా ముగిసిపోయింది.

కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రభుత్వం పంపిన పైల్‌ను గవర్నర్ ఆమోదించడంతో ఆయన నియామకం ఖరారైంది. ఫలితంగా ఈ ఉదయం ఆయన ఎస్‌ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించడంపై యోగేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వ జీవోను ఈ పిటిషన్ లో సవాల్ చేశారు. జీవోకు చట్టబద్ధత లేదని యోగేశ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

కొన్నివారాల కిందట ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి రుచించలేదు. దాంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి ఎస్ఈసీ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రమేశ్ కుమార్ పదవీకాలం ముగియడంతో ఎస్ఈసీగా ఆయనను తొలగించారు.

Tags: ysrcp, sec, nimmagadda rameshkumar, justice kanagaraj, high court

Next Story

Most Viewed