చంద్రబాబూ.! నిన్ను నీ కొడుకుని ఎప్పుడో పీకేశారు: మంత్రి వెల్లంపల్లి

by  |
చంద్రబాబూ.! నిన్ను నీ కొడుకుని ఎప్పుడో పీకేశారు: మంత్రి వెల్లంపల్లి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడను నాశనం చేసేందుకు చంద్రబాబు, టీడీపీలు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు కళ్లుండి కూడా కబోధిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.

అమరావతి రాజధాని అని చెప్పి విజయవాడ నగరంతో పాటు, ఇక్కడి ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓటు అడగడానికి వచ్చారని ప్రశ్నించారు. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్లంతా తెలుగుదేశం పార్టీతో కలిసిన దొంగల ముఠా. వీరంతా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి పని చేసిన వాళ్లే. అందుకే వారికి కూడా ఈ ఎన్నికల్లో విజయవాడలో ఓటడిగే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్‌మీరాలు ప్యాకేజీ నాయకులు అంటూ విరుచుకుపడ్డారు. ఉదయం నానా హంగామా చేసిన ఈ దొంగలంతా కలిసి మధ్యాహ్నానికి ప్యాకేజీ మాట్లాడుకుని ఒక్కటై పోయారన్నారు.

తాము అన్ని వర్గాల వారిని మేయర్ అభ్యర్థులుగా ప్రకటిస్తే చంద్రబాబు మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన వారినే మేయర్ అభ్యర్థులుగా ప్రకటించారన్నారు. వైసీపీపై విరుచుకుపడే చంద్రబాబు ముందు తమ పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మీ కేశినేని నాని నిన్ను ఉతికి ఆరేస్తున్నాడు చూసుకో అంటూ సూచించారు. మార్చి 10న జరిగే ఎన్నికల్లో నగరంలోని మొత్తం 64 డివిజన్లు వైసీపీ కైవసం కాబోతున్నాయి అని తెలిపారు.

మేయర్‌ పీఠాన్ని కూడా వైయస్సార్సీపీ దక్కించుకోబోతోందని దీమా వ్యక్తం చేశారు. మాట్లాడితే చాలు ఏం పీకుతారని అంటున్న చంద్రబాబును ప్రజలు ఇప్పటికే పీకేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే కాదు, చివరకు నీ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తీసి పడేశారు. ఇక మీ అబ్బాయిని కూడా మంగళగిరిలో పీకేశారు. అలా రాష్ట్రమంతా మీ ఉనికి లేకుండా అన్ని చోట్లా జనం మిమ్మల్ని పీకేశారు. అయినా ఇంకేం పీకాలి? ఇంకా పీకడానికి ఏం ఉందక్కడంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed