రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కౌంటర్

by  |
RevanthReddy1
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాజకీయ శూన్యత ఉంది కాబట్టే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని చెప్పుకొచ్చారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 151 స్థానాలు వచ్చిన ఏపీలో రాజకీయ శూన్యత ఎక్కడుంది? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

నదీ జలాల వినియోగంలో సీఎం కేసీఆర్ మాటతప్పారని విమర్శించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించుకోమన్న కేసీఆర్..డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆరోపించారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదంటూ మండిపడ్డారు. ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించకూడదని సూచించారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నిత్యం రాజకీయాలే కావాలంటూ సెటైర్లు వేశారు. తాను సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడానే తప్ప ఇంకెవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను పట్టించుకోవడం లేదంటూ మంత్రి పేర్ని నాని తెలిపారు.



Next Story

Most Viewed