కేంద్రమంత్రులతో వరుస భేటీలు..కారణమిదే

by  |
కేంద్రమంత్రులతో వరుస భేటీలు..కారణమిదే
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్రమంత్రులను కలుస్తూ కొత్త ప్రాజెక్టులతోపాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపైనా చర్చిస్తున్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శుక్రవారం భేటీ అయిన ఆయన కేంద్ర పోర్టులు, ఓడరేవులు, వాటర్ వేస్ మంత్రి సబరనాథ్ సోనోవల్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌లకు రావలసిన నిధులపైన చర్చించారు.

ఏపీ రాష్ట్రపారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మంత్రి గౌతమ్ రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్‌లకు అందించాల్సిన నిధులకు సంబంధించి కేంద్రమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టును గుర్తించి నివేదిక అందించాలని కేంద్ర మంత్రి సోనోవల్ మంత్రి మేకపాటిని కోరారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా కోస్టల్ కారిడార్ డెవలప్‌మెంట్ చేశామన్నది కేంద్ర మంత్రికి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమిలో ఏపీ ఏ విధంగా కీలకంగా వ్యవరిస్తుందన్న దానిపై కూలంకషంగా చర్చించారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం 2030 కల్లా ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10శాతం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతోందని కేంద్ర మంత్రి సోనోవల్‌కి మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఉత్సవం – 2021ని విజయవంతంగా నిర్వహించామని మేకపాటి కేంద్రమంత్రికి తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకూ సహకరిస్తామని కేంద్ర మంత్రి సోనోవల్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా, మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed