టీడీపీ ఎమ్మెల్సీకి హైకోర్టులో చుక్కెదురు

by  |
deepak reddy mlc
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎక్స్ అఫీసియో ఓటు తిరస్కరణపై ఆయన వేసిన పిటిషన్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎక్స్ అఫీసియో ఓటు పొందేందుకు దీపక్ రెడ్డి అనర్హుడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో విచారణ చేపట్టిన ఎస్ఈసీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితోపాటు వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీసియో ఓటును తిరస్కరించింది. దీంతో దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇకపోతే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీకీ అభ్యర్థులు అత్యధికంగా గెలిచినప్పటికీ వైసీపీ మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే 19 ఓట్లు అవసరం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి టీడీపీకి 20 మంది సభ్యుల బలం ఉంది.

వారందర్నీ టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపునకు తరలించారు. అయితే ప్రస్తుతం వైసీపీ ఖాతాలో కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎక్స్ ఆఫిషియో సభ్యులు కీలకంగా మారారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీకి ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఈనెల 18న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరి మున్సిపల్ చైర్మన్ పీఠం జేసీ ప్రభాకర్ రెడ్డిని వరిస్తుందా లేక వైసీపీని వరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.



Next Story