ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు విచారణ వాయిదా

by  |
ap high court
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసులపై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఎస్ఈసీ హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వివరించారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ ఇంకా మనుగడలో ఉందని ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అయితే హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయండంతో ఎస్‌ఈసీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందో వేచి చూడాలి.


Next Story