అమరావతిపై విచారణ వాయిదా

by  |
అమరావతిపై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్ : అమరావతిపై ఏపీ హైకోర్టులో విచారణ నవంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అంతర్గత పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ పూర్తి చేసింది. వైజాగ్‌లో నిర్మించే గెస్ట్ హౌస్‌ను రాజధానిలో భాగంగా కడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయని న్యాయవాది గుప్తా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్‌హౌస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చలేదని గుప్తా తెలిపారు.

విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదని న్యాయవాది గుప్తా కోర్టులో తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకెటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ, ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్‌హౌస్‌లు చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారని.. దానివల్లే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుప్తా కోర్టుకు తెలియజేశారు.

రాజధానిలో భాగంగా వైజాగ్‌లో గెస్ట్‎హౌస్ నిర్మాణం చేపట్టడం లేదని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో గెస్ట్‎హౌస్ నిర్మాణాలను చేపట్టామని వెల్లడించారు. జనాభా దామాషా ప్రాతిపదికన గెస్ట్‌హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed