‘ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకోవాలి’

by  |
‘ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకోవాలి’
X

దిశ, ఏపీ బ్యూరో: సహకార రంగంలోని షుగర్‌ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ తదితరులతో సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకూ వినియోగించగలమో ఆలోచించాలని సూచించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా సహకార చక్కెర ఫ్యాక్టరీలకు కాస్తైనా మేలు జరుగుతుందని సూచించారు. రైతులకు బకాయిలు లేకుండా మాఫీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రూ.54.6 కోట్లు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఈ మొత్తాన్ని జూలై 8న చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా దాదాపు 15 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలాగే శ్రీ విజయరామ గజపతి ఫ్యాక్టరీ కింద రూ.8.41 కోట్లు, చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రూ.22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ కింద రూ.10.56 కోట్లు, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రూ.8.88 కోట్లతో పాటు, అనకాపల్లి షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు రూ.4.63 కోట్ల బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలపై మరింత లోతుగా ఆలోచన చేసి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధ్యయనానికి మంత్రుల బృందానికి సూచించారు. ఆగస్టు 15 నాటికి ఈ విషయాలన్నిటిపైనా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.


Next Story