కొవిడ్ సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేశారు- డీజీపీ గౌతం సవాంగ్

by  |
కొవిడ్ సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేశారు- డీజీపీ గౌతం సవాంగ్
X

దిశ, ఏపీ బ్యూరో: పోలీసులకు కొవిడ్ ఒక ఛాలెంజ్‌గా మారిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. కొవిడ్ వంటి విపత్కర సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేశారని కొనియాడారు. ఈ కొవిడ్ మహమ్మారికి 206 మంది పోలీసులు బలయ్యారని తెలిపారు. 11 మంది గత సంస్మరణ దినోత్సవం తర్వాత మరణించారని స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంపై బుధవారం ఇతర అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న ఈ సంస్మరణ దినోత్సవం జరుపుతామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామని స్పష్టం చేశారు.

సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని అయినప్పటికీ వాటన్నింటిని తట్టుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. సమాజంలో పోలీసు కుటుంబాలతో సమానంగా ఎవరూ కష్టాలు భరించలేదని.. పోలీసుల కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు. ‘గర్భిణులు, పాలిచ్చే మహిళా పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చామని అలాగే క్వారంటైన్‌లో ఉన్న పోలీసులకు మానసిక ధైర్యం కల్పించాం. 1472 మందికి 7.57 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆర్ధిక సహాయం చేశాం. ఫ్యామిలీ వెల్ఫేర్ డెస్కుల ద్వారా అందరికీ సహాయం అందేలా చేశాం’ అని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed