ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కరోనా లక్షణాలివే..

by  |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కరోనా లక్షణాలివే..
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత కరోనా వైరస్ ధాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కరోనా వైరస్ కంటే కరోనా అనుమానితులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా లక్షణాలుగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి వాటిని ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా కరోనాలో వ్యాధిగ్రస్తుల్లో మరిన్ని లక్షణాలు కన్పిస్తుండడంతో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.

దీంతో ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ గతంలో ప్రకటించిన కరోనా లక్షణాలతో పాటు అదనంగా వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలను జాబితాలో చేర్చింది. దీంతో కరోనా సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కింద వివరించే 14 లక్షణాలు కనిపిస్తే కరోనాగా అనుమానించి చికిత్స తీసుకోవాలని ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ సూచించింది. ఆ లక్షణాలేంటంటే…1) జ్వరం 2) వణుకు 3) దగ్గు 4) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు 5) అలసట 6) ఒళ్లు నొప్పులు 7) తలనొప్పి 8) రుచి చూడలేకపోవడం 9) వాసన పసిగట్టలేకపోవడం 10) గొంతునొప్పి 11) ముక్కు కారడం 12) వికారం లేదా వాంతులు 13) డయేరియా తదితర లక్షణాలు ఏవి కనిపించినా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

అదే సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నప్పుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి లేదా 104 నంబర్‌కు కాల్ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.



Next Story

Most Viewed