ఏపీలో బాలికల కోసం జగన్ కొత్త పథకం

by  |
ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇప్పటికే ఏపీ మహిళలకు సీఎం జగన్ బంరాఫర్ ప్రకటించారు. మార్చి8న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి 10 శాతం రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు ఈ శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలన్నారు.

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థినిలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. మార్చి 8 ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అయితే ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. అయితే నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం‌ పంపిణీ చేయనుంది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనుంది.

తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్‌:
గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్‌ ద్వారా తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్‌ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. చేయూత స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్‌కిన్స్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనికోసం శానిటరీ నాప్‌కిన్స్‌ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్‌ ఎంఓయూ ఏకం కానున్నట్లు స్పష్టం చేశారు.

విద్యార్థినిలకు అత్యుత్తమ శిక్షణ:
అలాగే విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అందుకోసం లాప్‌టాప్‌లను వినియోగించాలన్నారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9 తరగతి ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్‌ ఇచ్చామని ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు రెప్యూటెడ్‌ సంస్ధలు సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను కోరారు. ఇంటరాక్టివ్‌ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎంపిక చేసిన నిపుణుల సహకారంతో శిక్షణ ఇవ్వాలన్నారు.

వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. లాప్‌టాప్‌లను విద్యార్థినిలకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఉన్నత విద్యాశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మిలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed