పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

by  |
ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన.. వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఏప్రిల్ 15 లోపు ఈ ప్రక్రియ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేనాటికి లే ఔట్లలో నీళ్లు, కరెంట్‌తోపాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతీ కాలనీలో ఒక మోడల్‌హౌస్ కట్టాలని సూచించారు. తామే ఇళ్లు కట్టుకుంటామనే వారికి నిర్మాణ సామగ్రిని అందించాలన్నారు.

పెద్ద మెుత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నందున లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమ్మెంట్, స్టీలు, మెటల్‌లాంటి నిర్మాణ సామగ్రి లభిస్తుందన్నారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ ఈ నెలాఖరుకి పూర్తి చేయాలని సూచించారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు మైండ్‌లో పెట్టుకుని పనిచేయాలని జగన్ హెచ్చరించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Next Story

Most Viewed