దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం : సీఎం జగన్

by  |
దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం : సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మరో చారిత్రాత్మక ‘భూ హక్కు- భూ రక్ష’ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం అయిన జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఈ సందర్భంగా సీఎం జగన్ మట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణా అందిస్తామని సూచించారు. ఇకపై దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూసేవారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

భూములకు రక్షణ అవసరమని, పాదయాత్రలో అనేకమంది బాధితుల కష్టాలు విన్నానని గుర్తుచేసుకున్నారు. ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భూమికి ప్రభుత్వం రక్షణ ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్‌ ఉంటుందని, గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు. అంతేగాకుండా భూ రీసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని, ప్రభుత్వ నిధులతోనే సర్వే రాళ్లను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి భూమికి ఐడీ నంబర్‌ ఇస్తామని, అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేస్తామని తెలిపారు. 2023 నాటికి భూ రీసర్వే పూర్తి చేస్తామని, దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలబడుతుందన్నారు.



Next Story