కరోనాపై పోరు.. 90రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ : సీఎం జగన్

by  |
కరోనాపై పోరు.. 90రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ : సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: నిన్న మొన్నటి వరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన కరోనా మహమ్మారి ఇప్పుడు మండల కేంద్రాలు, పల్లెలనూ పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చెయడం రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వైద్యఆరోగ్య శాఖాధికారులు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు ఆదేశించారు. ‘104’ సిబ్బందితో పాటు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి, నెలలో ఒకరోజు ‘104’ వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబ ఆరోగ్యాన్ని పరీక్షించాలని సూచించారు. షుగర్, బీపీ వంటి తనిఖీలు చేయాలని తెలిపారు. తద్వారా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ‘104’వాహనాల్లోనే కొవిడ్‌ శాంపిల్‌ సేకరించాలని ఆదేశించారు. ఏ ఆరోగ్య సమస్యకైనా మందులు అక్కడే అందజేయాలని సూచించారు. ఆరోగ్య స్థితిని బట్టి అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలని చెప్పారు.

ప్రతి గ్రామానికీ ‘104’ వాహనాలు వెళ్లాలి

‘104’ వాహనాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్లాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 50శాతం, మిగతా చోట్ల 50శాతం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కొన్ని పరీక్షలు సొంతగా చేసుకోవాలనుకునే వారికి అవకాశమివ్వాలని చెప్పారు. కరోనాపై ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కూడా టెస్టులు చేయాలని అన్నారు. ప్రజలు సమూహాలుగా ఉండే అవకాశమున్న ప్రతి రంగంలో సమగ్ర పరీక్షలు చేయాలని ఆదేశించారు.

విస్తృత అవగాహన కల్పించాలి

ఎవరికైనా కరోనా సోకిందని తెలియగానే చేయాల్సిన ప్రాథమిక పరీక్షలు లేదా అనుసరించాల్సిన విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం జగన్ చెప్పారు. ఈ మేరకు లోకల్ ప్రోటోకాల్‌ రూపొందించి, దానిని ప్రతి ఇంటికీ వివరించాలని చెప్పారు. అదే సమయంలో సమస్య రాగానే సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని చెప్పారు. ఈ తతంగమంతా రానున్న 90రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. అలాగే ప్రతి పీహెచ్‌సీలో కరోనా శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలని స్పష్టం చేశారు. కరోనా సోకినట్లు తేలితే ఏం చేయాలన్న సూచనలు వివరిస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో ఒక హోర్డింగ్ పెట్టి దానిలో వివరాలు ఉంచాలని చెప్పారు. దానిలో కరోనా పరీక్షలకు అవసరమైన పూర్తి సమాచారం ఉండాలని ఆదేశించారు.

హెల్త్ సెంటర్లను బలోపేతం చేయాలి

జనాభా ప్రాతిపదికన రూరల్ పీహెచ్‌సీలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లను కూడా బలోపేతం చేయాలని జగన్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. వర్షాకాలం ప్రవేశించిన నేపథ్యంలో జ్వరాలు సాధారణంగా వస్తాయని, అందుకే సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంతో పాటు కరోనాను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ ఎంత వరకు వచ్చిందని అధికారులను సీఎం ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు కరోనా అనుమానాలు రాగానే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి సమాచారం అందించేలా ఉండాలని అన్నారు.

జూలై 1న ‘108’ కొత్త వాహనాల ప్రారంభం

శానిటైజేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. అందుకు హోర్డింగ్స్ పెట్టాలని సూచించారు. 1.42 కోట్ల ఆరోగ్య శ్రీ కార్డుల్లో 1.20 కోట్ల కార్డుల పంపిణీ పూర్తయిందని సీఎం చెప్పారు. మిగిలిన కార్డుల పంపిణీ కూడా త్వరలోనే పూర్తవుతుందని అన్నారు. 104, 108 కొత్త వాహనాలు జూలై 1న ప్రారంభమవుతాయని వెల్లడించారు. కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చిన తొలి రాష్ట్రం మనదేనని తెలిపారు. మనుషులు, జంతువులు, పక్షులు ఎవరు ఉపయోగించే ఔషదాలకైనా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed