కీలక ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

by  |
jagan cabinet
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు.

ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది. గతేడాది కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. అయితే బడ్జెట్ ఆర్డినెన్స్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆర్డినెన్స్ పూర్తిగా పలాయనవాదం, దివాలాకోరుతనమని విమర్శించారు. ప్రజలన్నా, ప్రతిపక్షాలన్నా, చట్టసభలన్నా ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. బడ్జెట్ కూడా ఆర్డినెన్స్‌ల రూపంతో ఆమోదం పొందే దుష్ట సాంప్రదాయాన్ని సీఎం జగన్ తెచ్చారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed