ఆగస్టు 5న భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు!

by  |
ఆగస్టు 5న భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు!
X

దిశ, వెబ్ డెస్క్ :
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల ఐదో తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జలశక్తి సమావేశం కానుంది.అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5న అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని కోరారు. ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా.. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఎలాంటి ప్రతిపాదనలను నదీయాజమాన్య బోర్డులు, కేంద్రానికి పంపలేదు.

గతంలో కేంద్ర జల్‌శక్తి ఈ భేటీకి సంబంధించి ఎజెండా అంశాలు కోరినప్పటికీ రెండు రాష్ట్రాలు పంపలేదు. అయినా, ఎజెండాతోపాటు తేదీని ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్‌ కమిటీ సమావేశం జరగ్గా ఇది రెండోసారి. కేంద్ర లేఖపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సుముఖతగా ఉన్నట్లు సమాచారం.

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి నాలుగు అంశాలతో ఎజెండా రూపొందించింది. 1.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 2. అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం, 3. కృష్ణా, గోదావరి నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 4. కృష్ణా నదీ బోర్డు ప్రధాన కార్యాలయాన్నిఏపీకి తరలించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా డీపీఆర్‌ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.



Next Story

Most Viewed