ఎవరెస్టు రికార్డుల రాణి @ అన్షు జమ్సెన్పా

by  |
ఎవరెస్టు రికార్డుల రాణి @ అన్షు జమ్సెన్పా
X

దిశ, స్పోర్ట్స్ : అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఇండియా నుంచి రాణించిన వాళ్లు చాలా తక్కువ. ఇక ఆ స్పోర్ట్‌లో రాణించిన మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వేగంగా పారే జలాల్లో పడవ నడపడం, పారాగ్లైడింగ్, వాటర్ స్కీయింగ్, సర్ఫింగ్, స్కేట్ బోటింగ్, మౌంటైన్ బైకింగ్, పారాషూటింగ్‌తో పాటు రాక్ క్లైంబింగ్, మౌంటైన్ క్లైంబిగ్ వంటివి అడ్వంచర్ స్పోర్ట్ కిందకు వస్తాయి. సాహసంతో కూడిన ఈ ఆటలను మన దగ్గర ఆడేవాళ్లే కాదు.. వాటికి సరైన శిక్షణ ఇచ్చే వాళ్లు కూడా తక్కువే. అలాంటిది కేవలం తక్కువ శిక్షణతో మౌంట్ క్లైంబింగ్‌పై మక్కువ పెంచుకొని ఏకంగా రికార్డులు కొల్లగొట్టింది అన్షు జమ్సెన్పా. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆమె ఎవరెస్టును రెండు సార్లు ఎక్కిన ఘనతతో పాటు ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. అందుకే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

పిల్లలు పుట్టాకే..!

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఆఫీస్ కూతురైన అన్షుకు చిన్నతనం నుంచి కొండలు ఎక్కడంపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే త్సెరింగ్ వాంగే‌తో పెళ్లి అయిన తర్వాత ఆమెకు మౌంటైనింగ్‌పై అవగాహన వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ మౌంటనీరింగ్ అండ్ అడ్వంచర్ స్పోర్ట్ అసోసియేషన్ అధికారుల్లో త్సెరింగ్ వాంగే ఒకరు. అన్షుకు ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం ఏదో ఒక వ్యాపకం ఉండాలని భావించిన అన్షు.. తన భర్తతో విషయం చెప్పింది. నెమ్మదిగా రాక్ క్లైంబింగ్ చేర్చుకొని దానిపై మక్కువ పెంచుకుంది. అలా 2009లో పర్వతారోహనం ప్రారభించింది. నేను అడ్వంచర్ స్పోర్ట్‌లో మంచి ప్రతిభ కనపరుస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ అడ్వెంచర్ స్పోర్ట్ అసోసియేషన్ గుర్తించింది. అయితే ఎవరెస్టు ఎక్కుతా అని చెప్పినప్పుడు మాత్రం తన భర్త వాంగే ఒప్పుకోలేదు. ఇద్దరు పిల్లల తల్లి ఎలా ఎక్కగలదు అని ఆయన ప్రశ్నించారు. కానీ అన్షులోని ప్రతిభను చూడండి అంటూ భర్తను ఒప్పించారు. అలా ఎవరెస్టును ఎక్కడానికి సర్వం సిద్దం చేసుకున్నాను.

పర్వతారోహణ రికార్డులు..

అన్షు తొలి సారిగా 2011 మే 12న తొలిసారి ఎవరెస్టును అధిరోహించింది. ఆ తర్వాత అదే ఏడాది 21 మేలో రెండో సారి ఎవరెస్టు ఎక్కి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2013లో మరోసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. అయితే 2017లో మాత్రం ఒకే సీజన్‌లో రెండు సార్లు, అది కూడా ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఎవరెస్టు ఎక్కి రికార్డు సృష్టించింది. ఆ ఏడాది ఎవరెస్టును 118 గంటల 15 నిమిషాల్లో అధిరోహించింది. ఎవరెస్టును అత్యధిక సార్లు ఎక్కిన మహిళగా రికార్డు సృష్టించడమే కాకుండా, అత్యంత వేగంగా ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించింది. పర్వతారోహణంలో ఇన్ని రికార్డులు సృష్టించినందుకు గుర్తింపుగాను ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ఆమెకు ప్రతిష్టాత్మక తెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు కూడా వచ్చింది. ‘ఎవరెస్టు ఎక్కిన ప్రతీసారి దేవుడికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన జాతీయ పతాకాన్ని చేతిలో పట్టి ఎవరెస్టుపై పెట్టినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎవరెస్టును ఎక్కగలిగే శక్తి ఉన్నందుకు ఆనందిస్తున్నాను’ అని అన్షు చెబుతున్నది.

Next Story

Most Viewed