భూ వివాదంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఈటలలాగే బర్తరఫ్‌కు డిమాండ్

by  |
chevella mla
X

దిశ, ఖైరతాబాద్ : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, సునీల్ లు కలిసి మాట్లాడారు.. యాదయ్య తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చంచల్‌పేట్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు పి.కె కుమార్ ‌కు అప్పటి ప్రభుత్వం సర్వే నెం 189/2లో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. అలాంటి భూమి పై అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే కబ్జా చేశారని ఆరోపించారు. తమ భూమి వద్దకు వెళ్లిన కుమార్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని అన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే అనుచరులపై కేసు కూడా నమోదు అయిందని అన్నారు. రెవెన్యూ అధికారులు కూడా పంచనామా లో పీకే కుమార్ ఆయన వారసులకే ఈ ఆస్తి చెందుతుందని రిపోర్టు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

అయినా ఎమ్మెల్యే తన అధికార బలంతో భూమిని తన గుప్పెట్లో ఉంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం కలగజేసుకుని ఈటల రాజేందర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుందో అదే తరహా చర్యలు తీసుకోవడంతోపాటు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని కోరారు.

Next Story

Most Viewed