కరోనాకు మరో కలం యోధుడు బలి.. అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు

by  |
కరోనాకు మరో కలం యోధుడు బలి.. అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు
X

దిశ,పాలేరు: కరోనా విలయ తాండవానికి ఒకొక్కరు పిట్టల్లా రాలుతున్నారు. వైరస్ సోకి ఇబ్బంది పడేవారు కొందరైతే, మహమ్మారి బారినపడి మృత్యువాత చెంది కనీసం అంత్యక్రియలకు నోచుకోలేని వారు మరికొందరు. ఇక కొవిడ్ అంటుకొని ప్రాణాలు కోల్పోయారంటే చాలు, అయినవారు, ఆప్తులందరు ఒంటరిగా వదిలివేసి ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడనీ పరిస్థితి దాపురించింది. మానవ సంబంధ బాంధవ్యలు సైతం పటాపంచలు అయిపోతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్టు బోనగిరి నాగేశ్వరరావు మహమ్మారికి బలయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, సన్నిహితులు నాగేశ్వరరావు (54) అంతక్రియలు నిర్వహించారు. తమలో ఒకరిగా ఉండే నాగన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో మహమ్మారి అంటుకుంది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డాడు. ఇతను గత 20 సంవత్సరాలుగా సూర్య, ఆంధ్రప్రభ, వార్త చివరిగా ఆదాబ్ హైదరాబాద్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. అందరితో కలివిడిగా ఉండే నాగన్న మృతితో పాలేరు నియోజకవర్గ మీడియా మిత్రులు విచారం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో వరుసగా ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను వైరస్ వల్ల కోల్పోవడంతో భయాందోళన చెందుతున్నారు.

నాగేశ్వరరావు అంత్యక్రియలను ఆయన స్నేహితులైన కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, సర్పంచ్ చెన్న మోహన్,మొహమ్మద్ హాఫీజ్ ఉద్దీన్,ఎమ్ఎ రజాక్ (ఈనాడు రిపోర్టర్), మొహమ్మద్ రఫీ, అంతోటి వెంకన్న, కనకం మైసయ్య అంతోటి రాము(వార్త), ఇమ్మిడిశెట్టి సంతోష్(ఆంధ్రప్రభ), కొత్తూరు కిషోర్ సభ్యులు, ముక్కుకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి, కరోనా నిబంధన నడుమ ఆ మృతదేహానికి తామే సొంత బంధువులుగా మారి, అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీనితో వీరిని పలువురు అభినందించారు.



Next Story

Most Viewed