మోడీ ఇలాకాలో మరో నిర్భయ ఘటన

by  |
మోడీ ఇలాకాలో మరో నిర్భయ ఘటన
X

సూరత్: దేశం తలదించుకునే ఘటనలు రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవడంతోపాటు ఎన్ కౌంటర్లు చేస్తున్నా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. రాష్ట్రం ఏదైనా హత్యలు, మానభంగాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్ లో కాలేజీకి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి బిల్డింగ్ పైనుంచి తోసేశారు. ఈ హేయమైన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

సూరత్‌లోని పారల్ పాయింట్ ప్రాంతంలో ఓ యువతి (18) స్పృహ తప్పి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న సదరు యువతిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని పోలీసు అధికారి విధి చౌదరి తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిపి, కాలేజ్ పై అంతస్తు నుంచి కిందికి విసిరేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అత్యాచారం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు విధి పేర్కొన్నారు. బాధితురాలు తండ్రి టెంపో డ్రైవర్‌. బుధవారం ఉదయం కాలేజ్‌కు వెళ్లిన ఆమె రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.



Next Story