తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

by  |
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం మలబార్ గ్రూప్ అధినేత యంపి అహ్మద్, సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మలబార్ గ్రూప్ తమ నిర్ణయాన్ని తెలిపింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న కంపెనీ.. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పధాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తమ గ్రూపుకు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం 750 కోట్ల రూపాయల పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడి ఉన్న వ్యాపార అనుకూలతలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ కి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో పాటు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


Next Story

Most Viewed