ఎస్ఐ చెంప పగలకొట్టిన ఇల్లాలు

by  |
ఎస్ఐ చెంప పగలకొట్టిన ఇల్లాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు పోలీసుల తీరు పట్ల అక్కడి ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తండ్రి, కొడుకు లాకప్ డెత్ విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, తాజాగా విధుల్లో ఉన్న ఎస్‌ఐను ఓ వివాహిత పబ్లిగ్‌గా చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామానికి చెందిన ముత్తురామన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో అతని పేరు ఉంది. అయితే ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన ప్రైవేటు కాంట్రాక్టర్ సుభాష్ చంద్రబోస్‌తో ముత్తురామన్‌కు వివాదం తలెత్తింది. ఇంటి కోసం తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని కాంట్రక్టర్‌ పై ముత్తురామన్ ఆరోపణలు చేశాడు. దీనిపై తిరువెన్నైనల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో విచారణ కోసం ఎస్సై సహా ఇద్దరు పోలీసులు అనత్తూర్ చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముత్తురామన్‌ సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ ముత్తురామన్‌‌ను రక్తం వచ్చేలా కొట్టారు. అది చూసి తట్టుకోలేక పోయిన అతని భార్య సారథి కోపంతో ఊగిపోయింది. వెనకాముందూ చూసుకోకుండా భర్త‌ను కొట్టిన ఎస్సై చెంప పగలగొట్టింది.

అంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొట్టడమేంటని ప్రశ్నించారు. గ్రామస్తుల నిరసనతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ముత్తురామన్‌ భార్య పోలీస్‌ పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. డ్యూటీలో ఉన్న అధికారిపై చేయి చేసుకున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వారు విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed