ఆకలితో అలమటిస్తున్నాం.. జర మా గోడు వినండి : జర్నలిస్టులు

by  |
ఆకలితో అలమటిస్తున్నాం.. జర మా గోడు వినండి : జర్నలిస్టులు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాల ఆకలి తీర్చలేకపోతున్నాం, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజుల కోసం పడరాని పాట్లు పడుతున్నాం, ఆర్థిక కష్టాలు భరించలేక ఇప్పటికే నలుగురు తోటి ఉద్యోగులు ప్రాణం కోల్పోయారు, కనీసం మీరైనా మాకు న్యాయం చేయండి అంటూ ఆంధ్ర‌భూమి ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ చంద్రయ్యను వేడుకున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై శుక్రవారం ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హెచ్.ఆర్.సీలో పిటిషన్ దాఖలు చేశారు.

కొవిడ్ సాకుతో ఆంధ్రభూమి యాజమాన్యం ఏడాది కాలంగా ప్రచురణ నిలిపివేయడంతో పాటు ఉద్యోగులగు జీతాలు చెల్లించడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీరని అన్యాయానికి గురిచేస్తున్నారని వారు పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా తమకు దక్కాల్సిన ప్రయోజనాలను యాజమాన్యం విస్మరిస్తుందని ఉద్యోగులు వాపోయారు. పత్రికను పునరుద్ధరించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిని నమ్ముకొని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని వారు కోరారు . హెచ్.ఆర్.సిని ఆశ్రయించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, కె.రాములు, ఆంధ్రభూమి ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు విజయప్రసాద్, జె.ఎస్.ఎం.మూర్తి, కొండవీటి రవి, యం. స్వామినాథ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్యానికి నోటీసు..

ఉద్యోగుల న్యాయమైన పిటిషన్ పై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య స్పందించారు. ఆంధ్రభూమి యాజమాన్యానికి నోటీసులు జారీచేశారు. దీనిపై త్వరగా వివరణ ఇవ్వాలని కోరారు.

Next Story

Most Viewed