Viveka Case: ఊహించని మలుపు.. తెరపైకి రెండో భార్య

by Disha Web Desk 16 |
Viveka Case: ఊహించని మలుపు.. తెరపైకి రెండో భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తుది దశకు చేరుతున్న కొద్దీ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ హత్యపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత బెంగళూరులో సెటిల్మెంట్ వ్యవహారమే హత్యకు కారణమని ఆరోపణలు రాగా.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని వార్తలు వినిపించాయి. అనంతరం ఆర్థిక వ్యవహారాలే కారణం అని.. రాజకీయ వైరం కూడా హత్యకు కారణమనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈకేసు అక్రమ సంబంధాలవైపు మళ్లింది. తాజాగా రెండో భార్య అంశం తెరపైకి వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి తనను రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడని ఒక బిడ్డను కూడా కన్నానని రెండో భార్యగా చెప్తున్న షేక్ షమీమ్ సీబీఐకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి శివప్రకాశ్ రెడ్డికి, వైఎస్ సునీతారెడ్డికి ఇష్టం లేదని అందువల్లే తనను చాలా సార్లు బెదిరించారని ఆరోపించింది. ప్రస్తుతం షమీమ్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది.

హత్యకు ముందు వివేకా నాతో మాట్లాడారు:షేక్ షమీమ్

దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకేసులో అనేక చిక్కుముడులు వీడటం లేదు. మరోవైపు నిందితులు కోర్టులను ఆశ్రయిస్తూ విచారణను ముందుకు కదలనీయడం లేదు. ఇలాంటి తరుణంలో వివేకానందరెడ్డికి రెండో పెళ్లి అయ్యిందంటూ ఆయనకు కుమారుడు కూడా ఉన్నాడని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ బృందం రంగంలోకి దిగింది. వైఎస్ వివేకానందరెడ్డి రెండోభార్యంగా చెప్తున్న షేక్ షమీమ్‌ను సీబీఐ విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి షేక్ షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

వైఎస్ వివేకాతో తనకు రెండుసార్లు వివాహం జరిగిందని షమీమ్ తెలిపారు. అయితే తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులు శివప్రకాశ్ రెడ్డి, వైఎస్ సునీతారెడ్డిలకు ఇష్టం లేదని వాపోయారు. తనను శివప్రకాశ్ రెడ్డి, వైఎస్ సునీతారెడ్డి ఎన్నోసార్లు బెదిరించారని ఆరోపించారు. తన తండ్రికి దూరంగా ఉండాలని వివేకా కూతురు సునీతారెడ్డి కూడా బెదిరించారని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డికి, తనకు పుట్టిన కుమారుడు పేరు మీద భూమి కొనాలని వివేకా భావించారని, అయితే అందుకు శివప్రకాష్ రెడ్డి అడ్డుచెప్పినట్లు షమీమ్ ఆరోపించారు.

తమ వివాహం నేపథ్యంలో వైఎస్ వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని... చెక్ పవర్ కూడా లేకుండా చేశారని ఆమె వాపోయారు. చెక్ పవర్ లేకపోవడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని సీబీఐకు తెలిపారు. హత్యకు గురి కావడానికి కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని... బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్‌తో తమకు రూ. 8 కోట్లు వస్తాయని చెప్పారని తెలిపారు. వివేకా చనిపోయారని తెలిసినప్పటికీ శివప్రకాశ్ రెడ్డిపై ఉన్న భయంతో అక్కడకు వెళ్లలేకపోయానని వాపోయారు.

హైకోర్టుకు షేక్ షమీమ్?

ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టులో షేక్ షమీమ్ సైతం పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. తన పేరిట తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం తనకు రావాల్సిన ఆస్థిని వైఎస్ సునీత ఇవ్వాల్సిందిగా పిటిషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కొడుకు షేక్ షేహాన్ షా‌కు డీఎన్ఐ టెస్టులు జరిపి వైఎస్ వివేకా వారుసుడో కాదో చెక్ చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. తనకు రావాల్సిన వాటా తనకు ఇప్పించమని తెలంగాణ హైకోర్టును వివేకా రెండవ భార్య షేక్ షమీమ్ కోరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం షేక్ షమీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

ఎంపీ అవినాశ్ ఆరోపణలు నిజమేనా?

ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా రెండో పెళ్లి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రెండోపెళ్లి విషయం ఆధారంగా కేసు విచారణ చేపట్టాలని పదేపదే ఆరోపించారు. అంతేకాదు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించిన ఆరోపణలనే సీబీఐ వాంగ్మూలంలో షేక్ షమీమ్ స్పష్టం చేసింది.

అంతేకాదు ఆస్తి పంపకాల విషయంలో తండ్రీ కూతుళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని, అలాగే హత్యకు ముందు రోజుల్లో చెక్ పవర్ సైతం రద్దు చేశారంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను నిజం చేస్తూ షేక్ షమీమ్ సీబీఐకు వాంగ్మూలం రూపంలో తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Chintamaneni: రెడీగా ఈడీ, సీబీఐ.. త్వరలో జైలుకు జగన్

Avinashreddy: నేడు ముగిసినా.. రేపటి విచారణపై క్లారిటీ ఇవ్వని సీబీఐ

Next Story