చోరీ కేసు ఛేదన.. రూ.16 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-08 15:23:50  IST  )

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివకుమార్ మునియప్పన్ (27) అనే వ్యక్తిని వాసవి సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు...

చోరీ కేసు ఛేదన.. రూ.16 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
X

దిశ, కడప టౌన్: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివకుమార్ మునియప్పన్ (27) అనే వ్యక్తిని వాసవి సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మూగ, చెవిటివాడినని పేర్కొన్న చీటీని చూపిస్తూ ఇళ్లలోకి ప్రవేశించి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులను దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు.

ప్రొద్దుటూరులోని శంకరయ్య వీధిలో గంగనపల్లి శివాజీరావు ఇంట్లో చోరీ చేసిన కేసులో సీసీటీవీ ఫుటేజ్, నాట్‌గ్రిడ్ సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి ఉంగరాలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్, శాంసంగ్ ట్యాబ్, ఐఫోన్‌తో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు ఏఎస్పీ అభినందించారు.

Next Story