Kadapa: బ్రహ్మంగారిమఠంలో పదో తరగతి పరీక్ష ఆన్సర్ షీట్ కలకలం

by Disha Web Desk 16 |
Kadapa: బ్రహ్మంగారిమఠంలో  పదో తరగతి పరీక్ష ఆన్సర్ షీట్ కలకలం
X

దిశ, కడప: బ్రహ్మంగారిమఠంలో 10వ తరగతి తెలుగు పరీక్ష క్వశ్చన్ పేపర్‌కు సంబంధించి ఆన్సర్ షీట్ ప్రత్యక్షం కావడం కలకలం రేగింది. పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం కాగా 10.50 గంటలకు క్వశ్చన్ పేపర్ కు సంబంధించి ఆన్సర్ షీట్ ప్రత్యక్షం అయ్యింది. ఈ ఆన్సర్ షీట్ జిరాక్స్ సెంటర్ వద్ద గంగాధర్ అనే వ్యక్తి జిరాక్స్ తీయిస్తుండగా ఓ యూబ్ ట్యూబ్ చానల్ వ్యక్తి గమనించి యూట్యూబ్ లో ప్రసారం చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం కావడంతో వైరల్ అయ్యింది . ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి, డి. ఇ. ఓ రాఘవ రెడ్డి బ్రహ్మంగారి మఠం చేరుకొని విచారించారు. అనంతరం వీరు బ్రహ్మంగారి మఠం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైదుకూరు రూరల్ సి.ఐ నరేంద్ర, బ్రహంగారిమఠం ఎస్.ఐ విద్యాసార్ విచారణ చేపట్టారు. జిరాక్స్ తీయించుకున్న మల్లేపల్లి గ్రామానికి చెందిన గంగాథర్‌ను పొలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు.. తనకు మోటారు సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి రూ.20లకు విక్రయించారని తెలిపారు. ఆ వ్యక్తిని గుర్తు పడుతావా అంటూ పోలీసులు అడగ్గా తాను గుర్తు పట్టలేనని చెప్పారు.. పోలీసులు గంగాథర్ ను తమదైన శైలిలో విచారిస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రశ్నా పత్రంకు సంబంధించి సమాధాన పత్రం లీకు కాలేదని తెలిపారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

సి.ఐ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ దీన పై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. సమాధాన పత్రం లీకు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా బ్రహ్మగారిమఠంలో గురుకుల పాఠశాలలో 177 మంది, జిల్లా పరిషత్ బాలురు పాఠశాలలో 170, కస్తూరిబా గాంధీ పాఠశాలలో 117 మంది , మొత్తంగా 464 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

పలువురు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story