Kadapa: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురి అరెస్ట్

by Disha Web Desk 16 |
Kadapa: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్ జిల్లా గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు మర్రి సిద్దు అలియాస్ రాజు, అనకాపల్లికి చెందిన అద్దాడ కామరాజు, కె.నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు తెలిపారు. 3 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారే కాకుండా చిన్న చిన్న పొట్లాల్లో విక్రయిస్తున్న పదిమంది వ్యక్తులను అరెస్టు చేయగా విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మరికొందరిపై నిఘా ఉంచామని చెప్పారు. గంజాయి దాచినా, కొన్నా, అమ్మినా, రవాణా చేసినా, అందుకు సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.


పదే పదే గంజాయి నేరాలకు పాల్పడే వారిపై పి.డి యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్.పి హెచ్చరించారు. గంజాయి వినియోగిస్తున్న వారికి రిహాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. విద్యా సంస్థల వద్ద మహిళా పోలీసులతో నిఘా ఉంచుతామన్నారు. గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారాన్ని ప్రజలు డయల్ 100 లేదా తన ఫోన్ నెంబర్ 9440796900కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు



Next Story

Most Viewed