Viveka Murder Case: అన్నీ ఆయనకు తెలుసు.. అవినాశ్ రెడ్డి (Video) వైరల్

by Disha Web Desk 16 |
Viveka Murder Case: అన్నీ ఆయనకు తెలుసు.. అవినాశ్ రెడ్డి (Video) వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తాను అమాయకుడిని అని ప్రకటించుకున్నారు. ఈ హత్యకేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారన్న సంగతి తనకంటే వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు తెలుసునని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రాంతం వద్ద దొరికిన లెటర్, మొబైల్ ఫోన్‌లను పీఏ కృష్ణారెడ్డితో దాచేయాలని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆదేశించాడని గుర్తు చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ప్రజా సేవలో ఉన్నందున అసలు హత్య జరిగిన రోజు ఏం జరిగింది.. హత్య ఘటన వద్ద జరిగిన పరిణామాలు, సీబీఐ విచారణ, తాను సీబీఐకి ఇచ్చిన సమాచారంపై ప్రజలకు తెలియజేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ దర్యాప్తు తీరుపై ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎంపీ అవినాశ్ రెడ్డి సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

వివేకా బావమరిదికి సర్వం తెలుసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయాన్ని ఆయన బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి తనకు ఉదయం 6:30కి ఫోన్ చేసి చెప్పారని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. తాను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నానని జీకే కొండారెడ్డి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి వెళ్తున్నట్లు గుర్తు చేశారు. సరిగ్గా పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్నప్పుడు తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని వివేకా నో మోర్ అని నాకు ఫోన్‌లో చెప్పారన్నారు. సమాచారం అందుకున్న వెంటనే తాను వైఎస్ వివేకా ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఉన్నాడని...బాత్ రూంలో ఉన్న డెడ్ బాడీని చూపించినట్లు వీడియోలో తెలిపాడు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపించాయా? అని అడిగితే తొలుత కృష్ణారెడ్డి లేదని చెప్పాడన్నారు. కానీ వాస్తవానికి తాను అక్కడికి వెళ్లక ముందే అక్కడున్న లెటర్, మొబైల్ ఫోన్ మాయమైనట్లు తెలిసిందన్నారు. లెటర్, మెుబైల్ ఫోన్ల గురించి వివేకా పీఏ కృష్ణారెడ్డి వివేకా కూతురు, అల్లుడికి సమాచారం ఇచ్చాడని అయితే అల్లుడు రాజశేఖర్ రెడ్డి రెండింటినా దాచేయాలని ఆదేశించడంతో పీఏ కృష్ణారెడ్డి వాటిని భద్రపరిచినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు.

లేఖలో ఏముందంటే?

వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖలో తన డ్రైవర్‌ను వదలొద్దు అని రాసి ఉందని స్పష్టం చేశారు. ఈ మొత్తం మర్డర్‌ కేసులో ఆ లెటరే చాలా కీలకం అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ప్రసాద్‌ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారని గుర్తు చేశారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్‌ ప్రసాద్‌నే నమ్ముతారా? లెటర్‌ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్‌ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్‌ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయం నేను సీబీఐకి చెప్పాను’ అని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. అంతేకాదు సీబీఐ స్టేట్‌మెంట్‌లో సునీతా ఒక్కో స్టేట్‌మెంట్‌ ఒక్కో మాదిరిగా చెబుతుంది. ఒక్క స్టేట్‌మెంట్ చాలా వివరంగా చెబుతుంది. తర్వాత స్టేట్‌మెంట్‌లో తప్పులను కవర్ చేస్తుంది. తాను అలా అనలేదని, మర్చిపోయానని చెబుతుంది అని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీబీఐపైనా సంచలన ఆరోపణలు

వివేకా హత్యకేసులో సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలకు సీబీఐ స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. సునీత చేసిన మిస్టేక్స్‌‌ను కవర్ చేసుకునే స్వేచ్ఛకూడా ఇస్తోందని ఆరోపించారు. వైఎస్ వివేకా రాసిన లేఖపై ఎందుకు సీబీఐ ఫోకస్ చేయడం లేదని నిలదీశారు. లెటర్ విషయాన్ని బహిర్గతం చేయకపోవడం ఈ కేసులో అతిపెద్ద తప్పు అని ఆరోపించారు. ఇంత పెద్ద అంశాన్ని దాచిపెడితే సీబీఐ విచారణలో రామ్ సింగ్ దానిని డౌన్ ప్లే చేశారు అని ఆరోపించారు. సీబీఐ మొత్తాన్ని తాను బ్లేమ్ చేయడం లేదకానీ ఈ కేసు దర్యాప్తులో రామ్ సింగ్ వైఖరి మాత్రం చాలా తేడాగా ఉందని ఆరోపించారు. లెటర్‌ను డౌన్ ప్లే చేయడం ఎవరిని కాపాడేందుకు? అని ప్రశ్నించారు. శివప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతను కాపాడేందుకు రామ్ సింగ్ ఇదంతా చేశారు అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

సీఐకి ఏం చెప్పానంటే?

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సీఐకి ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారు అని ఫిర్యాదు చేసినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. మీరు తొందరగా రండి అని కోరానని గుర్తు చేశారు. అయితే ఎలా చనిపోయాడని సీఐ అడిగారని..తెలియదు కానీ బెడ్రూంలో, బాత్ రూంలో కూడా బాగా రక్తం ఉందని చెప్పాననని ఎంపీ అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

అవినాష్ రెడ్డి ఆరోపణలు

వైఎస్ వివేకానందరెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక చనిపోయిన వ్యక్తి కూతురు, అల్లుడు గురించి మాట్లాడకలేక తనపై, తన తండ్రిపై ఎన్ని విమర్శలు వచ్చినా మాట్లాడలేకపోయాను అని ఎంపీ అవినాశ్ రెడ్డి వెల్లడించారు. అయితే సీబీఐ విచారణకు రెండు సార్లు హాజరైనా తర్వాత వాళ్లు తప్పుదోవలో వెళ్తున్నారని తనకు అర్థమైందని అందువల్లే తాను ఈ విషయాలు బయటపెడుతున్నట్లు తెలిపారు. సీబీఐ వేసిన రెండు చార్జ్‌షీట్లు, కోర్టుకు ఇచ్చిన సాక్షుల స్టేట్‌మెంట్స్, వివిధ సందర్భాల్లో కోర్టుల్లో వేసిన కౌంటర్ అఫిడవిట్స్, విచారణ సందర్భంగా సీబీఐ తనకిచ్చిన ప్రశ్నావలిని ఆధారంగా చేసుకుని తాను మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో అబద్దానికి మొత్తం అప్రూవర్ థీయరి పునాదిని నిర్మించారని ఆరోపించారు. ‘కేసులో ఒక్కరిని అప్రూవర్‌గా చేసేటప్పుడు పాటించిన నిబంధనలు సరైనవా? కావా? వాచ్‌మెన్ రంగన్న.. నలుగురు వ్యక్తులు చంపినట్టుగా సాక్షిగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ నలుగురిలో ఒక్కరిని అప్రూవర్‌గా మార్చాల్సిన అవశ్యకత ఉందా? లేదా? అప్రూవర్‌గా మారిన వ్యక్తి పూర్వపరాలు పరిశీలించాల్సి ఉంది. అయితే దస్తగిరి రికార్డుల ప్రకారం కిరాయి కిల్లర్. అతడు డబ్బు కోసం వ్యక్తిత్వ హననం చేయడనే గ్యారెంటీ ఏముంది. అలాంటి వ్యక్తిని అప్రూవర్‌గా తీసుకోవడం ఎంతవరకు సమంజసం’? అని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

రాబోయే రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి

ఒక హత్యలో పాత్ర ఉన్న వ్యక్తిని అప్రూవర్‌గా చేయడం విచిత్రంగా ఉంది. అతడిని అప్రూవర్‌గా మార్చాలని సీబీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత సునీతా రెడ్డి మౌనంగా ఉండటం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. తండ్రిని చంపిన వ్యక్తిని ముద్దాయి నుంచి సాక్షిగా మారిస్తే సాధారణంగా పిల్లలు దర్యాప్తు సంస్థతో కొట్లాడుతారు కానీ ఇక్కడ వాళ్లు మాత్రం మౌనంగా ఉండటం చూస్తుంటే అంతా కుమ్మక్కయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏ-4గా ఉన్న అతడు నేరాన్ని అంగీకరించిన తర్వాత సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు. హత్య చేసిన కిరాయి రౌడీకి ఎందుకు ఇంతా రిలీఫ్ ఇచ్చారు. అతడిని ఒక పావుగా వాడుకుని తమను టార్గెట్ చేయడం కోసమేనా? దస్తగిరిని గానీ, సునీల్ యాదవ్ గానీ తాము గుర్తించే వ్యక్తులు కూడా కాదు. ఈ రెండేళ్లుగా పేపర్లు, టీవీల్లో పెద్దగా రావడం వల్ల వాళ్లను గుర్తించగలుగుతున్నాం. వీళ్లు తమపై తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, వెనకాల ఉండి సీబీఐ, సునీత ఇలా చెప్పించడం నిజంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed