RSC: రాయలసీమకు తీవ్ర అన్యాయం.. ఢిల్లీలోనే పోరు

by Disha Web Desk 16 |
RSC: రాయలసీమకు తీవ్ర అన్యాయం.. ఢిల్లీలోనే పోరు
X

దిశ, కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై జులై నెలలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం కడపలో నిర్వహించిన రాయలసీమ స్టీరింగ్ కమిటీ విస్తృత సమావేశానికి బైరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అనాధిగా వివక్షకు గురవుతూనే ఉందన్నారు. అప్పటి పాలకుల నుంచి ఇప్పటి పాలకుల వరకూ ఏ ఒక్కరూ రాయలసీమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాయలసీమలో జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలోనే పోరు నిర్వహించేందుకు జులై నెలలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

3.5 లక్షల సంతకాల సేకరణ

ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ వ్యాప్తంగా 3.5 లక్షల మంది సంతకాల సేకరణ చేపట్టామన్నారు. మలి విడత సంతకాల సేకరణ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. రాయలసీమ ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తినిందన్నారు. ప్రత్యేక రాయలసీమ కోసం అనువుగా ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటామన్నారు.


1951లో కృష్ణా -పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే రాయలసీమలో కరువు ఉండేది కాదన్నారు. 1956లో కర్నూలు రాజధానిని పొగొట్టుకుని రాయలసీమ మరోసారి దెబ్బతిందన్నారు. రాయలసీమ నడిగడ్డ హోస్పేటను వదులుకున్నామన్నారు. రాయలసీమకు దెబ్బమీద దెబ్బలు పడుతూనే ఉన్నాయన్నారు. సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తద్వారా 60 టి.ఎం.సిల నీరు నిల్వ చేస్తే రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అంది సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తీగెల వంతన కడుతామని చెపుతోందని, దాని వల్ల రాయలసీమ దరిద్రం పోతుందా అని బైరెడ్డి ప్రశ్నించారు.

అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాలు పూర్తిగా నష్టపోతాయని బైరెడ్డి తెలిపారు.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అప్పర్ భద్రను ఆపితే పులివెందులకు కూడా నీళ్లివ్వొచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నాటకలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. దీని వల్ల నష్టపోయేది ముందుగా రాయలసీమ ప్రాంతమేనని ఆయన పేర్కొన్నారు. హోస్పేట్ డ్యాంలోనీ నీరు స్మగ్లింగ్ జరుగుతోందన్నారు. 69 జీ.ఓను రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు, అలగనూరు రిజర్వాయర్, పొతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు పాడై ఏళ్లు గడుస్తున్నా చర్యలు శూన్యమని బైరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి‌కి నాలుగేళ్లు ఢిల్లీకి వెళ్లేందుకే సమయం సరిపోతోందన్నారు. ఇంత దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాయలసీమ నాశనం చేసింది, చేస్తోంది సినీమావాళ్లేనన్నారు. రాయలసీమపై లేని పోనివి చూపించి రక్తపాతమంటూ ప్రచారాలు ఊదరగొట్టి రాయలసీమకు పెట్టుబడులు రాకుండా చేస్తోంది వాళ్లేనని చెప్పారు. ఖనిజాలకు ఆలవాలం, వర్షానికే వజ్రాలను అందించే గొప్ప పుణ్యనేల రాయలసీమ అని బైరెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed