ఆలయశుద్ధి పేరుతో హైడ్రామా.. మాజీ మంత్రి విడదల రజనిపై కేసు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-03 09:02:34  IST  )

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆలయశుద్ధి పేరుతో హైడ్రామా.. మాజీ మంత్రి విడదల రజనిపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో వెళ్లిన విడదల రజని ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని అధికార ప్రభుత్వం చెబుతుండగా.. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్తూ విడదల రజని ఆలయాన్ని శుద్ధి చేయడానికి శ్రీకారం చుట్టడం వివాదాస్పదమైంది. ఆమెను ఆలయంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. విడదల రజనితో వచ్చిన వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్తామని పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కు పంపించారు. ఈ ఘటనతో విడదల రజని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారంటూ.. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేశారు. దీనిపై విడదల రజని, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు రాష్ట్రంలో గడిచిన రెండ్రోజులుగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై అధికార, ప్రతిపక్షాలు, టీటీడీ సభ్యుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేపాయి. దీంతో టీడీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. ఈ ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడాన్ని హైకోర్టు సైతం తప్పుపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోల్ లోకి వచ్చేవరకూ ఆయన ఇంటికి పోలీసులు భద్రత కల్పించాలని ఆదేశించింది.

పవన్ కళ్యాణ్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు: విడదల రజిని

Next Story