సొంత ఎమ్మెల్యేలపై జ 'గన్'.. సీఎం తీరుతోనే వైసీపీలో ముసలం..?

by Disha Web Desk 19 |
సొంత ఎమ్మెల్యేలపై జ గన్.. సీఎం తీరుతోనే వైసీపీలో ముసలం..?
X

అధికారం చేపట్టిన నాటి నుంచే సీఎం జగన్ సొంత పార్టీ​ ఎమ్మెల్యేలను, నాయకులను పక్కన పెట్టేశారు. వాలంటీర్లు, సచివాలయాలు, కలెక్టర్లతో పాలన నడిపారు. జగన్ సీఎం కాకముందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వెలుగొందేవారు. కాంట్రాక్టర్లు, నోరుగలిగినోళ్ల నెట్​వర్క్​పట్టుతో అధికారం చెలాయించేవారు. మూడున్నరేళ్లలో ఎమ్మెల్యేల బలగాన్నంతటినీ సీఎం జగన్​తుత్తునియలు చేసేశారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు లేరు. గ్రామాల్లో వాలంటీర్ల దెబ్బకు వివిధ సామాజిక వర్గాల పెద్దలంతా గోళ్లు గిల్లుకుంటున్నారు. ఎమ్మెల్యేల పెత్తనానికి గండి కొడుతున్నారని అర్థమయ్యేసరికి తట్టుకోలేక పోతున్నారు. రేపోమాపో సీటు లేదు పొమ్మన్నా ఎమ్మెల్యేలు ఏం చేయలేని దుస్థితి. అందుకే తిరుగుబావుటా ఎగరేస్తున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డికి బీజేపీ ఆహ్వానంతో వైసీపీలో ముసలం పుట్టడం వెనుక, వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు వెనుక ఢిల్లీ కమలం పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యవహార శైలితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన శాసనసభ్యులు నేడు చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. సహజంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని తమ అధికారానికి అడ్డాగా భావిస్తుంటారు. అక్కడ ఉండే కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఇచ్చే చందాలతో ఎన్నికల్లో ఖర్చు పెడుతుంటారు. వివిధ సామాజిక వర్గాల పెద్దలను కనుసన్నల్లో ఉండేట్లు చేసుకుంటారు. ఆయా కులాల్లోని పేదలు తమకు ఏదైనా సంక్షేమ పథకం కావాలన్నా, కాస్త ఆర్థిక స్తోమతున్నోళ్లు పదవులు కావాలన్నా వైట్ అండ్​వైట్​డ్రస్‌లో మెరిసిపోయే పలుకుబడిదార్ల వద్దకు వెళ్లాల్సిందే. ఈ పెద్ద మనుషుల ద్వారా తమ రాజకీయ అధికారాన్ని ఎమ్మెల్యేలు సుస్థిరం చేసుకుంటుంటారు. ఈ వ్యవస్థను సీఎం జగన్​మూడున్నరేళ్లలో కూకటి వేళ్లతో పెకలించారు.

అభద్రత, ఆందోళన..

సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేల నెట్​వర్క్‌కు ఎక్కడా ప్రాతినిధ్యం కల్పించలేదు. కేవలం వాలంటీర్లు, సచివాలయాలు, కలెక్టర్లతో నడిపించారు. కాంట్రాక్టర్లు చేయడానికి పనుల్లేవు. ఒక వేళ పనులు ఇచ్చినా బిల్లులు రావని ఆసక్తి చూపడంలేదు. పథకాల అమలులో కుల సంఘాల నాయకులకు జోక్యం లేకుండా చేశారు. ఆయా కులాల కార్పొరేషన్లలో వాళ్లను చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించి సంక్షేమ పథకాల ప్రచారానికి పరిమితం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ఆయుపట్టు మొత్తాన్ని పకడ్బందీగా నిర్వీర్యం చేశారు. చివరకు ఎమ్మెల్యేలు కూడా అనివార్యంగా భజన చెక్కలు తీసుకొని సీఎంకు భజన చేసేట్లు మల్చుకున్నారు. ఇక్కడే ఎమ్మెల్యేల అహం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రేపు సీటు ఇవ్వనంటే తమ గతేంటనే ఆలోచనలో పడ్డారు. ఇలాగే ఉపేక్షిస్తే చివరకు తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతామనే అభద్రతకు లోనయ్యారు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సంక్షేమ పథకాల్లో జగన్​మార్కుపైనా గుర్రు..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మైక్రో లెవల్లో ఓట్లు వేయించే వర్గాలకే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. పంటలు సాగు చేసే రైతులకు రైతు భరోసా లబ్ధి నామమాత్రమే. కౌలుకు ఇచ్చే భూయజమానులకే ఎక్కువగా అందుతోంది. జగనన్న చేదోడు పథకం ఐదారు లక్షలు వెచ్చించి సెలూన్లు పెట్టుకున్న యజమానులకే వర్తిస్తుంది. అక్కడ కూలికి పనిచేసే క్షురకులకు అందదు. నెలకు ఐదు నుంచి పదివేలు అద్దెలు చెల్లించి పెట్టుకున్న ఇస్త్రీ షాపులు, డ్రై క్లీనింగ్​షాపు ఓనర్లకే జగనన్న తోడు అందుతోంది. రోడ్డుపై బండి మీద ఇస్త్రీ పెట్టె పెట్టుకున్నోళ్లకు ఇవ్వడం లేదు. నేతన్న నేస్తం పథకం రోజువారీ మజూరీ చేసుకునే పేద చేనేతలకు కాదు. వాళ్లకు పనులిచ్చే మాస్టర్​వీవర్లకు సాయం అందేట్లు నిబంధనలు రూపొందించారు. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి పథకంలోనూ ఆయా కులాల్లో ఆర్థిక స్తోమతు ఉండి పలుకుబడి కలిగిన వాళ్లకే సాయం అందేట్లు నిబంధనలు అమలు చేస్తున్నారు. వాళ్లే ఆయా కులాల్లోని పేదల ఓట్లు వేయించగలరనే ధీమా కావొచ్చు. దీని వల్ల నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతున్నామనే ఆవేదన ఎమ్మెల్యేల్లో నెలకొంది.

కమలనాథుల పాత్రపై అనుమానాలు..

అసమ్మతి గళం వినిపించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి బీజేపీ ఆహ్వానం పలికింది. అమిత్​షా ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సోము వీర్రాజు.. ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి తోడు నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి కూడా రాజకీయ ఓనమాలు దిద్దింది ఆరెస్సెస్​అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘంలోనే. ఓ వైపు వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడం.. మరోవైపు పార్టీలో అసమ్మతి గళాలు ఎలుగెత్తడం వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.

Also Read..

ధర్మ రక్షణతోనే ప్రపంచ శాంతి సాధ్యం: ఆర్‌ఎస్‌ఎస్


Next Story

Most Viewed