Nara Lokesh : పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఒరిగేదేమీ లేదు..

by Dishafeatures2 |
Nara Lokesh : పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఒరిగేదేమీ లేదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టబోయే యువగళం పాదయాత్రపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు. లోకేశ్ పాదయాత్రకు ఇంకా చంద్రబాబు అనుమతి ఇవ్వలేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు తన సొంత పుత్రుడు కంటే దత్త పుత్రుడిని ఎత్తుతున్నాడని చెప్పుకొచ్చారు. లోకేశ్ పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా లాభం లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర యువతను మోసం చేసిన వ్యక్తి లోకేశ్ అని, జగనన్న వచ్చాక యువతకు ఉపాధి కల్పించినట్లు గుర్తు చేశారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తులు చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. వీరిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోల ఫోజుకి తప్ప దేనికి పనికిరాడని విమర్శించారు. పాదయాత్ర చేసి ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్‌లకు ఇక మిగిలింది శవ యాత్ర మాత్రమేనని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed