చిన్నారిపై రాజకీయ నేత అమానుషం: మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

అనంతపురంలోని రుద్రంపేటలో గుండెల్ని పిండేసే అమానుష ఘటన వెలుగుచూసింది. కేవలం ఆరేళ్ల వయసున్న చిన్నారిపై ఓ రాజకీయ నేత అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

చిన్నారిపై రాజకీయ నేత అమానుషం: మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapur)లోని రుద్రంపేట(Rudrampet)లో గుండెల్ని పిండేసే అమానుష ఘటన వెలుగుచూసింది. కేవలం ఆరేళ్ల వయసున్న చిన్నారిపై ఓ రాజకీయ నేత అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణాన్ని పసిగట్టిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేయడమే కాకుండా, తల నీలాలను తొలగించి, ముఖానికి రంగు పూసి వీధుల్లో ఊరేగించారు. అనంతరం నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినప్పటికీ, పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మహిళా కమిషన్ సీరియస్

ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ ఘటనపై ఆరా తీస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ చుట్టాలు కాదని, చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

బాధిత కుటుంబానికి భరోసా

మహిళా కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అధికారులు, ఆ కుటుంబానికి పూర్తి భరోసా కల్పించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, బాధితులకు తక్షణ న్యాయం అందేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని ప్రకటించారు. నిందితుడి రాజకీయ నేపథ్యం ఏదైనా సరే, కఠినంగా శిక్షించాల్సిందేనంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story