గొడవ పడుతూనే భర్తను పొలాల్లోకి తీసుకెళ్లిన భార్య.. కొద్దిసేపటికే దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లా ఆదోని అమరావతి నగర్‌కు చెందిన మహేష్, ఈరమ్మల ప్రేమ కథ విషాదాంతమైంది. 2013లో ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు..

గొడవ పడుతూనే భర్తను పొలాల్లోకి తీసుకెళ్లిన భార్య.. కొద్దిసేపటికే దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఆదోని అమరావతి నగర్‌కు చెందిన మహేష్, ఈరమ్మల ప్రేమ కథ విషాదాంతమైంది. 2013లో ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. ఎంతో అందంగా సాగిపోవాల్సిన వీరి సంసారంలో పెళ్లయిన కొంతకాలానికే మనస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భార్య ఈరమ్మ ఫిర్యాదు మేరకు 2019లో భర్త మహేష్‌పై గృహహింస కేసు కూడా నమోదైంది. అప్పటినుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ, తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

ఇద్దరి మధ్య గొడవ

శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మాట మాట పెరిగి వివాదం ముదరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఈరమ్మ భర్త మహేష్‌ను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లింది. అక్కడ కూడా వారి మధ్య ఘర్షణ కొనసాగింది. కోపం కట్టలు తెంచుకోవడంతో ఈరమ్మ క్షణికావేశంలో భర్తపై దాడి చేసి, అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ప్రేమించి పెళ్లాడిన భర్తను తనే స్వయంగా ప్రాణాలు తీసేంతలా ఆమెలో కసి పెరిగిపోవడం స్థానికంగా కలకలం రేపింది.

భర్తను చంపిననట్లు అంగీకరించిన భార్య

ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలు ఈరమ్మను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో భర్తను తానే హత్య చేసినట్లు ఆమె తప్పును అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఈ హత్య వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story