ఫలించిన ఎంపీ కృషి.. పది రోజుల్లో విజయవాడకు వైడ్ -బాడీ విమానాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-04 11:33:56  IST  )

త్వరలో విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్ బాడీ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ..

ఫలించిన ఎంపీ కృషి..  పది రోజుల్లో విజయవాడకు వైడ్ -బాడీ విమానాలు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్ బాడీ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తీవ్రంగా కృషి చేశారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడు కార్యాల‌యంలో ఇండిగో ప్లైయిట్ స్పెష‌ల్ డైరెక్టర్ ఎ.కె.సింగ్‌తోపాటు ఎంపీ జి.ఎం. హరీష్‌తో భేటీ అయ్యారు. విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య ఏటిఆర్ విమానాల్లో ప్ర‌యాణికులపై పడుతున్న టిక్కెట్ ఆర్థిక భారంపై, సీట్ల కొరత, ల‌గేజీ స‌మ‌స్యల‌ను ఎ.కె.సింగ్‌‌కు వివ‌రించారు.


దీంతో ఇండిగో ప్లైయిట్ స్పెష‌ల్ డైరెక్టర్ ఎ.కె.సింగ్ సానుకూలంగా స్పందించారు. ప‌ది రోజుల్లో విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్-బాడీ విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. వైడ్ - బాడీ విమానాలు అందుబాటులోకి వ‌స్తే టిక్కెట్ ధ‌ర త‌గ్గటంతో పాటు సీట్లు అందుబాటులోకి కూడా ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల ల‌గేజీ స‌మ‌స్య కూడా ప‌రిష్కరం అవుతుంద‌న్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ కోరిన విధంగా విజయవాడ నుంచి వారణాసి, అహ్మాదాబాద్, పుణే, కొచ్చిన్, గోవా విమాన సర్వీసులు న‌డిపించేందుకు రూట్ మ్యాపింగ్ రెడీ చేస్తామన్నారు. అధ్యాత్మిక ప్రాంత‌లైన‌ వార‌ణాసి, కొచ్చిన్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు త్వర‌గా ప్రారంభించాల‌ని కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్రత్యేకంగా కోరారు. అమ‌రాతి రాజ‌ధాని ప్రాంతంలో భాగ‌మైన విజ‌య‌వాడ విమానాశ్రయంపైనే ఏలూరు, గుంటూరు, న‌ర‌స‌రావుపేట‌, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప్రయాణికులకు భారం ప‌డుతుంద‌ని, అందువ‌ల్ల వారి అవ‌స‌రాల‌కు త‌గ్గట్లు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Next Story