వివాదంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం: సజ్జల, సీఎస్‌లకు హైకోర్టు నోటీసులు

by Disha Web Desk 21 |
వివాదంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం: సజ్జల, సీఎస్‌లకు హైకోర్టు నోటీసులు
X

దిశ , డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే వైసీపీ మేల్కొంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, మా నమ్మకం నువ్వే జగన్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. తాజాగా ఇటీవలే వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టుకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా పిటిషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

రెండు వారాలపాటు వాయిదా

జర్నలిస్ట్ కట్టెపోగు వెంకయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టులు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ డా.కేఎస్ జవహర్ రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాలపాటు వాయిదా వేసింది.



Next Story

Most Viewed