Ugadi Panchangam: ఏపీకి కాబోయే సీఎం ఎవరు?

by srinivas |
Ugadi Panchangam: ఏపీకి కాబోయే సీఎం ఎవరు?
X
  • వైఎస్ జగన్ జాతకమెలా ఉంది?
  • చంద్రబాబు ఇంద్రుడు అవుతారా?
  • ప్రధాని పీఠంపై మోడీ మళ్లీకూర్చుంటారా?
  • పంచాగ పఠనంలో ఏం తేలింది?
  • పంచాంగ శ్రవణంలో వాస్తవమెంత
  • పార్టీల పార్టీలకు పంచాంగం మారిపోతుందా?
  • ముఖస్తుతి కోసం చెప్పారా? వాస్తవం చెప్పారా?
  • పొలిటికల్ పంచాంగ శ్రవణంపై గందరగోళం

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాంగ శ్రవణం ఎవరు చేసినా దాదాపుగా ఫలితాలన్నీ ఒకేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పంచాంగంను బట్టే జాతకాలను నిర్దేశిస్తారు కాబట్టి. అయితే రాను రాను ఈ పంచాంగాలలో కూడా రాజకీయం చేరిపోయింది. పంచాంగ శ్రవణం ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా నిర్వహిస్తోంది. టీడీపీ నిర్వహించే పంచాంగ శ్రవణంలో టీడీపీకి చాలా అనుకూల వాతావరణం ఉంటుందని చెప్తారు. అటు వైసీపీ నిర్వహించే పంచాంగ శ్రవణంలో వైసీపీకి అనుకూల ఫలితాలను వెల్లడిస్తారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీకి సానుకూలంగా పంచాంగ శ్రవణం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పంచాంగ శ్రవణం చేసేవారు తమకు నమ్మకమైన వారు చేస్తే ఆయా పార్టీల అధినేతలు ఫుల్ జోష్‌లో ఉంటారన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. అయితే స్వరూపానందేంద్ర స్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. కలిసి వస్తుందా లేక బెడిసి కొడుతుందా? అసలు స్వామీజీ ఏం చెప్పబోతున్నారు అంటూ చర్చ జరిగింది. ఉగాది రానే వచ్చేయడంతో నమ్మకస్తుడైన స్వరూపానందేంద్ర స్వామి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలను బయటపెట్టేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ అధికారంలోకి వస్తారా రారో అనేదానిపై స్వరూపానందేంద్ర స్వామి ఏం చెప్పారో ఓసారి చూద్దాం.

వైసీపీ పంచాంగ పఠనంలో ఏం చెప్పారంటే

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ ఉగాది. దేశ విదేశాలలో ఉన్న తెలుగువారంతా సొంతింటికి చేరి కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయతతో గడుపుతారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. ఉగాది వస్తే చాలు పంచాంగ శ్రవణం గురించే చర్చ వస్తోంది. ఏ రాజకీయ పార్టీకి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది.. ఎవరు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు? ఈ ఏడాది తమ నాయకుడికి బాగా కలిసి వస్తుందా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాను రాను ఈ పంచాంగ శ్రవణంలో కూడా రాజకీయాలు చేరిపోవడంతో రాజకీయ పార్టీలు కూడా ఈ పంచాంగ పఠనంను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఇకపోతే ఈ ఏడాది 2023 ఉగాది పండుగ రోజు కూడా ఆయా రాజకీయ పార్టీలు కూడా పార్టీ కార్యాలయాలలో ఇంటి దగ్గర పంచాంగ పఠనం నిర్వహించాయి. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసంలో అధికారికంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని వెల్లడించారు. ఆహార ఉత్పత్తులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాగ పఠనంలో తెలియజేశారు. మరోవైపు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయని సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనంలో వెల్లడించారు.

టీడీపీ పంచాంగ పఠనంలో అంతా బాబుకు సానుకూలమేనట

మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ చంద్రబాబు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ పంచాంగ పఠనం చేశారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బలపడుతుందని చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు మరింత బలపడతారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు ఆశ్చర్యం కలిగిస్తాయని.. అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరుగుతాయని..పరిపాలనలో న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని, ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారుతాయని వెల్లడించారు. అదే తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. చంద్రుడు ఇంద్రుడవ్వాలని, తెలుగు రాష్ట్రాలకు శుభం జరగాలి, యువగళం నవగళం కావాలంటూ ముక్తాయించారు.

ముగ్గురికే అధికారం

ఇన్నీ ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లు నమ్మే పీఠాధిపతి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి. ఈయన నిర్వహించిన పంచాంగ పఠనంలో అటు వైసీపీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి తీపి కబురు చెప్పారు. వైఎస్ జగన్‌కు అంతా శుభమే జరుగుతుందని వెల్లడించారు. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఈ ఏడాది కలిసి వస్తుందని ఈ ముగ్గురు జాతకాలు అత్యంత బేషుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే పరోక్షంగా మళ్లీ అధికారంలోకి రావొచ్చంటూ సంకేతాలిచ్చేశారు. ఈ ఏడాది అంతా సీఎం జగన్ అద్భుతమైన కాలం నడుస్తోంది అని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో జగన్ విజయం సాధిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతాయని చెప్పుకొచ్చారు. సీఎం జాతకం దృష్ట్యా ఇబ్బంది ఉండదని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ఉగాది వేడుకలను నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించడం విశాఖ శారదాపీఠం సంప్రదాయంగా పాటిస్తోందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పుకొచ్చారు.

అక్కడలా ఇక్కడిలా

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి పంచాంగ పఠనంలో ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లా జాతకం అద్భుతంగా ఉందని వెల్లడించారు. కానీ టీడీపీ పంచాంగంలో ప్రతిపక్షాలకు బాగుందని చెప్పారు. అటు వైసీపీ నిర్వహించిన పంచాంగ పఠనంలో కేంద్రంలో మోడీ దశ బాగుందని, మోడీకి-జగన్ కి మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని వెల్లడించారు. అయితే టీడీపీ నిర్వహించిన పంచాంగంలో మాత్రం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడిపోతాయని చాలా గ్యాప్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో చంద్రుడు ఇంద్రుడవుతాడంటూ వెల్లడించారు. ఈ పంచాంగ పఠనంలు చూసిన సామాన్యుడు ఇంతకీ ఇందులో ఏది వాస్తవం ఏది ముఖస్తుతి కోసం చెప్పారోనని గుసగుసలాడుకుంటున్నారు. ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే మరో ఏడాది ఓపిక పట్టాల్సిందేనని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : Breaking: ఏపీలో మరో ఎన్నిక.. తీవ్ర ఉత్కంఠ

Next Story

Most Viewed