Katrenikona అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

by Disha Web Desk 16 |
Katrenikona అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో మైనరు బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీరెడ్డి కోనసీమ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం లేకుండా వ్యవహరించేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలివ్వాలని కమిషన్ సభ్యులు కోరారు. కేసును పారదర్శక విచారణతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్‌కు నివేదించాలని జయశ్రీరెడ్డి కోరారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకీరామ్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వివరించారు. నేరానికి పాల్పడిన వారిని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ తెలియజేశారు. బాధితురాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్యం సక్రమంగా అందించాలని అమలాపురం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రెడ్డి ఆదేశించారు.

కాగా బట్టలు ఉతికేందుకు సరుగుడు తోటలోని బావి వద్దకు వెళ్ళిన బాలికపై కొందరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. లక్ష రూపాయలు వెలకట్టి బయట చెప్పొద్దంటూ బాధిత బాలిక కుటుంబానికి పెద్దలు తీర్పు తీర్చారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కోన శివారులో సముద్ర తీరం వద్ద ఓ మైనర్ బాలిక బట్టలు ఉతికేందుకు బావి వద్దకు వెళ్ళింది. అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని సరుగుడు పొదలలోనికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రలు ఆరా తీశారు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పెద్దలకు విషయం చెప్పగా గ్రామ కట్టుబాట్లు మేరకు పంచాయితీ నిర్వహించి బాధితురాలికి లక్ష రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేశారు.

అయితే ఒప్పందం ప్రకారం నగదు ఇచ్చే విషయంలో జాప్యం జరగటంతో అసలు విషయం బయటకు పొక్కి సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో విషయం పోలీసులకు చేరింది.దీంతో అమలాపురం డి.ఎస్.పి వై మాధవరెడ్డి ఈ సంఘటన పై స్పందించి బాధిత కుటుంబాన్ని కలిసి జరిగిన ఘోరంపై విచారణ చేపట్టారు. ఇందుకు బాధితులైన ఓలేటి తేజ, పోలేటి తులసిరావు, ఓలేటి ధర్మారావు, మల్లాడి వంశీ, అద్దాని సత్తిపండు లపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed