ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల నాని.. సీఎం ఖరారు!

by Disha Web Desk 16 |
ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల నాని.. సీఎం ఖరారు!
X
  • కోటగిరి శ్రీధర్ తప్పుకోనున్నారా?
  • ఎంపీ సీటుపై మాజీ డిప్యూటీ సీఎం కన్నేశారా?
  • జిల్లా ప్రజలు ఆళ్ల నానికి జై కొడతారా?
  • ఏలూరులో సైలెంట్‌గా ఎంపీ సీట్ సెటిల్మెంట్..

దిశ, ఉమ్మడి పశ్చిమగోదావరి బ్యూరో: రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏలూరు పార్లమెంట్ సీట్ హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో టికెట్‌ల కసరత్తు మొదలవగా, ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానంపై శ్రద్ధ చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ సీటుపై మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకి పొక్కకుండా గుట్టు చప్పుడుగా జరుగుతున్న తీరు ఏలూరు పార్లమెంట్ మొత్తం చర్చనీయాంశం అవుతోంది.

ఎంపీ స్థానానికి శ్రద్ధ చూపని కోటగిరి శ్రీధర్

కోటగిరి శ్రీధర్ ఏలూరు పార్లమెంట్ స్థానం 2019లో గెలుపొందిన ఆయన జిల్లాలో పర్యటించడంలో విఫలం అయ్యారు. పార్టీ క్యాడర్‌ని బలోపేతం చేస్తూ వర్గ పోరుతో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉంటారని ఆ పార్టీ వర్గాల వారే ప్రచారం సాగిస్తున్నారు. విజయం సాధించినప్పటి నుండి జిల్లాలో ప్రైవేట్ కార్యక్రమాలకే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవటం చాలా తక్కువని జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు మాత్రమే వచ్చి కనపడతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది ఇలా ఉండగా స్థానికంగా బలమైన సామాజిక వర్గం లేకపోవడం, మొదటిసారిగా ఎంపీ కావడం, స్థానిక వైసీపీ నేతలు పెట్టే ఆంక్షలతో ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏలూరులో రాజకీయం చేసేందుకు అవకాశం లేకుండా చేశాయని పార్టీ వర్గాల్లో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ బరిలో పోటీ చేసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. జిల్లాలో కోటగిరి శ్రీధర్ సామాజిక వర్గమైన వెలమ దొరల జనాభా ఎక్కువగా ఉన్న నూజివీడు నియోజకవర్గంపై శ్రీధర్ కన్ను పడినట్లు తెలుస్తోంది.

ఎంపి అభ్యర్థిగా ఆళ్ల నాని ఖరారు!

ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ (నాని) వైయస్ రాజశేఖర్ రెడ్డికి ప్రియ శిష్యుడు, సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఏలూరు పార్లమెంట్ స్థానంపై అసహనం వ్యక్తం చేసినా అధినేత ఆ సీటు పై హిట్ లిస్ట్‌లో ఆళ్ల నాని పేరు ఖరారు చేశారట. నాని ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలుపొంది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో ఆరోగ్య మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేశారు. నియోజవర్గంలో ఆయనకు మంచి పట్టున్నప్పటికీ, వర్గపోరు మాత్రం వెంటాడుతూనే ఉంది. ఆ నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉండటంతో రాజకీయ వ్యవస్థ దుమారం రేపుతోంది. నియోజవర్గంలో పట్టునప్పటికీ వ్యతిరేకత కూడా అలానే ఉంది. మరోసారి శాసనసభ్యుడుగా పోటీ చేస్తే నాని ఓటమి ఖాయమని చర్చ సాగుతోంది. దీంతో ఏలూరు పార్లమెంట్ బరిలో దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు జనాభా అధికంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఏలూరు కావడంతో, ఆళ్ల నాని ఆలోచన మార్చుకొని ఎంపీ స్థానంపై కూర్చునేందుకు పావులు కదుపుతున్నారట.

కాన రాని పని తనం

ఇటీవలే మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన ఆళ్ల నాని సైలెంట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో కూడా అలసత్వం వహించడంతో అధినేత కన్నెర్ర చేసినట్లు తెలిసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నానిని నియమించినప్పటికీ వేరే వర్గం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. వలస వచ్చిన నాయకులతో తలనొప్పిగా మారిందని నాని వర్గంలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత ఆళ్ళ నానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పదవులు ఇస్తుంటే ఆయన మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు ప్రజలు అంటున్నారు.

Next Story

Most Viewed