ఏపీ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం: పురంధేశ్వరి

by Seetharam |
ఏపీ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం: పురంధేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల పక్షాన రాజీలేని పోరాటం బీజేపీ మాత్రమే చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. పంచాయతీల నిధులు దగ్గర నుంచి ఇసుక, లిక్కర్ మాఫియా పై కూడా పోరాటం బీజేపీ మాత్రమే చేస్తోందని వెల్లడించారు.ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డపుశీలలో టిడ్కో ఇళ్ళను పురంధేశ్వరి సోమవారం పరిశీలించారు. టిడ్కో ఇళ్ళ ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డు అక్కడ ఉండడాన్ని పురంధేశ్వరి పరిశీలించారు. బోర్డు ఏర్పాటుపై హౌసింగ్ అధికారిని నిలదీశారు. టిడ్కో ఇళ్ళ కు సొమ్ము లు కట్టించుకుని టిడ్కో ఇళ్ళను ఇవ్వక, కనీసం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వలేదని బాదితులు హౌసింగ్ అధికారి ముందు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఫిర్యాదు చేశారు. పేదల పట్ల మీ నిర్వాకం ఇదా అంటూ వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు మనోభావాలు తెలుసు కోవడం కోసం పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాజకీయ అంశాల పై పార్టీ వైఖరిని ప్రజలకు వివరిస్తామన్నారు. 19జిల్లాలు పర్యటన పూర్తి చేయడం జరిగిందని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.


ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్ర సహకారంతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కేంద్రం నుండి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు. టిడ్కో ఇళ్ళు 2018లో ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేయలేదు.. ప్రస్తుతం ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రోడ్లుదారుణంగా ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ఉయ్యాల జంపాల మాదిరిగా రోడ్లు ఉన్నాయి అని మండిపడ్డారు . రాష్ట్రంలో అన్ని రంగాలలో అవినీతి పెట్రేగిపోతుందని అన్నారు. ‘తోటపల్లి రిజర్వాయర్ బ్యారేజ్ పనులు లేవు. నిర్వాసితులు ఆదుకోలేదు. ఝంజావతి 35 వేల ఎకరాల సాగు నీరు అందిస్తోంది అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పార్వతీపురం లో 16గిరిజన గ్రామాల అభివృద్ధి లేదు. షెడ్యూల్ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది’ అని దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషం రగిల్చి కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే పనిలో ఉందని మండిపడ్డారు. ఏపీలో ఎన్నికలకు బీజేపీ సమాయత్తంగా ఉందని... కార్యకర్తలు సైతం అందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

Next Story

Most Viewed