కాస్త ఆగు బ్రదర్..! నాగబాబు దూకుడుకు తమ్ముడు పవన్ కల్యాణ్ బ్రేకులు

by Disha Web Desk 1 |
కాస్త ఆగు బ్రదర్..! నాగబాబు దూకుడుకు తమ్ముడు పవన్ కల్యాణ్ బ్రేకులు
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానంటూ హడావుడి చేసిన నాగబాబు స్పీడుకు జనసేన అధినేత, సోదరుడు పవన్ కళ్యాణ్ బ్రేకులు వేశారు. పార్టీలో పదేళ్ల నుంచి పని చేస్తున్న నాయకులను పక్కనపెట్టి కొత్తగా చేరిన సుందరపు సతీష్ తదితరులను వెంటవేసుకొని నాగబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన సమీక్షలు బెడిసి కొట్టాయి. స్థానిక నాయకులను పట్టించుకోకపోవడం, కార్యకర్తలను దూరం పెట్టడం, సెల్ఫీల కోసం దగ్గరికి వచ్చిన వారిని " బాస్టర్డ్ " అంటూ తిట్టడం నాగబాబు రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో నాగబాబు కారణంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన పవన్ కళ్యాణ్ ఆయన కాస్త స్లో కమ్మని చెప్పినట్లు తెలిసింది.

కొణతాల నుంచి మొదలైన మార్పు

మాజీ మంత్రి సీనియర్ నేత కొణతాల రామకృష్ణను పూర్తిగా విస్మరించి నాగబాబు అనకాపల్లిలో పర్యటించడం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాగబాబు పక్కనపెట్టిన కొణతాల రామకృష్ణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి వచ్చారు. తొలి జాబితాలోనే ఆయన అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో నాగబాబు హవాకు, ఆయనను నడిపిస్తున్న సుందరపు సతీష్ కోటరీకి గండి పడినట్లు సంకేతాలు వెలువడ్డాయి. టికెట్ ప్రకటించిన తర్వాత అనకాపల్లిలో కొణతాల యాక్టివ్ కాగా, అప్పటి నుంచి నాగబాబు కనిపించకుండా పోయారు.

సభకు హాజరు కాని నాగబాబు

తాడేపల్లిగూడెంలో బుధవారం నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహించిన భారీ సభలో నాగబాబు ఎక్కడా కనిపించలేదు. హాజరు కాలేదు. అదే సభలో కొణతాల పాల్గొని ప్రసంగించారు. నాగబాబు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి సకాలంలో హాజరు కాలేకపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే రాలేదని తెలిసింది.

నాగబాబు-సతీష్‌ల కోటరీ భవిష్యత్తు గందరగోళమే

నాగబాబుకు ఆయనకు ఆర్థికంగా అండగా నిలిచిన సతీష్‌కు మొదటి జాబితాలో టిక్కెట్ల కేటాయింపు ప్రకటన వస్తుందని హడావిడి చేశారు. మీడియాకు లీకులు ఇచ్చారు. ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిద్దరి చుట్టూ తిరిగిన పలువురు నేతల పరిస్థితి ఏమిటో అన్నది సందిగ్ధంగా మారింది. సుందరపు సతీష్ ద్వారా నాగబాబు తమకు అన్నీ చేసి పెడతారని విర్రవీగిన కొందరు నేతలు తాజా పరిణామాలతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

విశాఖ ఎస్‌ఈ‌జెడ్ బెదిరింపులపై విచారణ

అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే అచ్చుతాపురం ఎస్ఈజడ్, పరవాడ ఫార్మా పార్కుల్లో కొందరు జనసేన నేతలు దందాలు చేశారని అంశంపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. తమదే అధికారమని తామే కాబోయే ప్రజాప్రతినిధులమని చెబుతూ ఫార్మా పార్క్, ఎస్ఈజెడ్‌లను కొందరు పారిశ్రామిక వేత్తల నుంచి భారీ మొత్తాలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియటంతో పారిశ్రామిక వేత్తల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Read More : వైఎస్ వివేకా మర్డర్‌.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed