Anakapalli: ఆస్తి కాపాడతానని అడ్వకేట్ మోసం.. ఏస్పీకి బాధితుల ఫిర్యాదు

by Disha Web Desk 16 |
Anakapalli: ఆస్తి కాపాడతానని అడ్వకేట్ మోసం.. ఏస్పీకి బాధితుల ఫిర్యాదు
X

దిశ, అనకాపల్లి: హైకోర్టు అడ్వకేట్ అంటూ వైద్యుడి కుటుంబ సభ్యుల ఆస్తిని కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు ఒక ప్రబుద్ధుడు. అనకాపల్లిలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు కరోనా సమయంలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు వారి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో డాక్టర్ భార్య నాగరత్నంను దొమ్మేటి రవితేజ తాను అడ్వకేట్ అంటూ పరిచయం చేసుకున్నారు. తమ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటానని నమ్మబలికాడు. కొడుకులు విద్య ఉద్యోగరీత్యా బయట ప్రాంతాల్లో ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అడ్వకేట్ మాటలను నమ్మాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆస్తులు తమ పేరు మీద ఉంటే ప్రాణానికి హాని కలుగుతుందని తక్షణం ఆస్తులను మార్పు చేయాలని సూచించారు. అప్పటికే పెద్ద దిక్కుని కోల్పోయిన నాగరత్నం చేసేదేమీ లేక రవితేజ తండ్రి వెంకటరమణ పేరుపై అనకాపల్లి మండలంలోని 3.37 ఎకరాల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ విషయం తెలుసుకున్న నాగరత్నం కొడుకు సాయి శశాంక్ రవితేజను నిలదీయగా 90 లక్షలు రూపాయలు ఇస్తే తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దీంతో రవితేజకు 25 లక్షల రూపాయలు అందజేశామని సాయి శశాంక్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తామని హామీ ఇవ్వడంతో వెంకటరమణ పేరుపై ఉన్న ఆస్తిని తిరిగి డాక్టర్ గారి కుటుంబ సభ్యుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రవితేజ మిగిలిన మొత్తం ఇమ్మని డిమాండ్ చేయడంతో జరిగిన మోసంపై పోలీసు ఉన్నతాధికారులకు డాక్టర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అవసరానికి వాడుకుంటానని తీసుకున్న కారును కూడా రవితేజ తిరిగి ఇవ్వలేదని సాయి శశాంక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కక్ష పెంచుకున్న రవితేజ డాక్టర్ కుటుంబ సభ్యులపై తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులతోపాటు రేప్ కేసులు కూడా పెడతానని బెదిరించారు. రవితేజ, ఆయన మిత్రులు నాగార్జున. మురళి కారణంగా తమకు ప్రాణహాని ఉందని. తమను కాపాడాలంటూ అనకాపల్లి ఎస్పీ కార్యాలయానికి డాక్టర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.



Next Story