రాగల 24 గంటల్లో.. ఏపీకి వాతావరణశాఖ కూల్ న్యూస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-29 12:19:46  IST  )

రాష్ట్రంలోని పలు జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రీ మాన్ సూన్ కంటిన్యూ అవుతుందని పేర్కొంది.

రాగల 24 గంటల్లో.. ఏపీకి వాతావరణశాఖ కూల్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పలు జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. రానున్న 24 గంటల్లో ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే తూర్పు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో కొన్ని భాగాల్లో నైరుతి పవనాలు విస్తరించాయని తెలిపింది. మరో మూడ్రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మెల్లగా తగ్గే అవకాశం ఉందని.. రాష్ట్రంలో ప్రీ మాన్ సూన్ యాక్టివిటీ కొనసాగుతుందని పేర్కొంది. దాని ప్రభావంతోనే వడగళ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కాగా.. ఎల్ నినో ఎఫెక్ట్ తో వర్షపాతం తక్కువగా ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు 93 శాతం వర్షపాతాన్నిచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

రేపు వాతావరణం ఇలా..

రాష్ట్రంలో శనివారం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీవ్రమైన ఎండతో పాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడవద్దని సూచించారు.

Next Story