వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

by Thanuru Gopichand |

కొనసాగుతూనే ఉన్నా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.

వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు (హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై వివేకా కుమార్తె వైఎస్ సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణను కేవలం పాక్షికంగా, అంటే కేవలం ఇద్దరి పాత్రలకే పరిమితం చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో విచారణ జరగాలని, లోతైన దర్యాప్తు ద్వారానే అసలైన నిందితులు బయటపడతారని ఆమె వాదనలు వినిపించారు.

​జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ, ఇంకెంత కాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని ప్రశ్నించింది. సునీత పిటిషన్ పై తమ వైఖరి తెలియజేయాలని సీబీఐను ఆదేశించింది. ఇంకెంత కాలం దర్యాప్తు చేయాలనుకుంటున్నారు? ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? అని సీబీఐ అధికారులను ప్రశ్నించింది. ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడానికి ఇంకో పదేళ్లు పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయాలని సూచించింది. కేసును లాజికల్ ఎండ్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. సీబీఐ వైఖరి ఆధారంగా కేసులో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉంటుందని అడిగింది. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసి ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే తమ వైఖరిని తెలియజేసేందుకు సీబీఐ తరపున న్యాయవాది కొంత సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Next Story