Visakha: కిడ్నీ దందా.. తిరుమల ఆస్పత్రి సీజ్

by Disha Web Desk 16 |
Visakha: కిడ్నీ దందా.. తిరుమల ఆస్పత్రి సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో జరిగిన కిడ్నీ దందాపై అధికారులు సీరియస్‌ అయ్యారు. తిరుమల ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ బాధితుడు వినయ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆస్పత్రిలో జరిగిన ఘటనపై డీఎమ్‌హెచ్‌వో నివేదిక రెడీ చేసింది. ఈ మేరకు హాస్పిటల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రికి అనుమతి లేదని గుర్తించారు. సర్జరీ చేసిన వైద్యుడిని నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కిడ్నీ రాకెట్ దందా గుట్టురట్టు

కాగా విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ అమ్మకం వ్యవహారంలో మీడియేటర్ కీలకంగా వ్యవహరించగా, ఎముకుల డాక్టర్ కిడ్నీని తొలగించడం వెనుక మూలాల్ని పోలీసులు శోధించే పనిలో పడ్డారు. కామరాజు అనే వ్యక్తి ఒక పేషెంట్‌కు కిడ్నీ అత్యవసరమని చెప్తూ డబ్బులు ఆశ చూపెట్టేవారు. వాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ ఒక దశలో పరిచయం అయ్యారు. కిడ్నీ కొనుగోలు చేసే వ్యవహారాన్ని చెప్పడంతో అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడంతో తన కిడ్నీ అమ్మేందుకు ఒప్పించారు. రూ.8.5లక్షలకు ఒప్పందం కుదరగా, అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు అందచేశారు. ఆపరేషన్ పూర్తి అయ్యింది.. తన శరీరం నుంచి కిడ్నీ వేరు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వలేదు.

కిడ్నాప్ చేసి కిడ్నీ ఆపరేషన్

ఇదిలా ఉండగా అడ్వాన్సు తీసుకున్నప్పటికి ఆపరేషన్‌కు ఇంకా సిద్ధపడలేదని, సమయం కావాలని అడిగారు. అయితే వినయ్‌తో కామరాజు మాట్లాడాలని చెప్పి పిలిపించి కిడ్నాప్ చేసి కిడ్నీని వేరు చేశారు. తన పని పూర్తి కాగానే వినయ్‌ను ఇంటివద్దకు చేర్చి చేతులు దులుపుకున్నారు. తనకు చెల్లించాల్సిన మిగతా నగదు విషయమై ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వినయ్ పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కామరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

బాధితుడు వినయ్ కుమార్ బంధువులు, స్థానికుల ఆందోళన

మరోవైపు విశాఖ కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. మధురవాడ వాంబే కాలనీలో బాధితుడు వినయ్ కుమార్‌తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమయంలో వినయ్ కుమార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి న్యాయమైనా ఇక్కడే జరగాలంటూ స్థానికులు పట్టుబట్టారు.

Next Story