Big Breaking: కేంద్రపాలిత ప్రాంతంగా విశాఖ?

by Disha Web Desk 16 |
Big Breaking: కేంద్రపాలిత ప్రాంతంగా విశాఖ?
X
  • ఢిల్లీలో కేంద్రమంత్రుల సమావేశం?
  • హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత అంశాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రజలు

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ముమ్మర ప్రచారమవుతోంది. ఈనేపథ్యంలో విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే సమాలోచనలు చేసింది. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ అంశం అక్కడితో ముగిసిపోయింది.

మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కీలక నగరంగా ఉన్న విశాఖపట్నంపై ఆ తరహా ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నాన్ని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేయకూడదనే చర్చ ఢిల్లీలో కొనసాగుతున్నట్లు భోగట్టా.

విశాఖలో పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు ఉండటం. త్రివిధ దళాలకు సంబంధించి కీలక కార్యాలయాలు ఉండటం, దీనికి తోడు సుధీర తీర ప్రాంతం కావడం. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలతో శత్రుత్వంతో ఈ తీర ప్రాంతం ద్వారా విశాఖకు ముప్పు వాటిళ్లే అవకాశం ఉండటం దృష్ట్యా బీజేపీ కేంద్ర ప్రభుత్వం విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తమ నిర్ణయం తెలియజేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజన ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని ఇక్కడ ప్రజలు ఎంతో ఆశించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఖరా ఖండిగా చెప్పేసింది. కేంద్రంపై ఈ విషయమే పోరాటం చేసే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్లడం లేదు. స్వప్రయోజనాల కోసం ఈ పార్టీలు పెద్దగా ఏమీ చేయలేదని ప్రజలే విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాజధానుల రగడ కూడా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అని టీడీపీ, కాదు ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వైసీపీ వాదించుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఇప్పటికే ప్రకటించింది.

పరిపాలన సాలభ్యం కోసం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే మూడు రాజధానులు ఉండాల్సిందేనని వైసీపీ గట్టిగా చెబుతుంది. ఈ రచ్చ ఇలా కొనసాగుతుండగానే విశాఖను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మరో పక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించనప్పటికీ అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే నిజం అయితే విశాఖ ద్వారా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్న ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం జరగనుందన్నది వాస్తవం. నేవీ, డిఫెన్స్, పోర్టు లాంటి సంస్థలు, సుధీర్ఘ సముద్ర తీరం పట్ల ఆకర్షితులైన కేంద్ర మంత్రులు ఈమేరకు ఓ ప్రతిపాదన పెట్టారనేది ఈ చర్చకు తెర లేచింది. దీనిపై ఇది వరకే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు పరిశీలించి వెళ్ళారని, త్వరలో ఈ ప్రతిపాదన వెలుగు చూస్తుందని సమాచారం.

కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటివరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి. అయితే, దిల్లీ, పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా, మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబడుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు ఉండవు.

దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించవల్సి వచ్చిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పరచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధాన సభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ముఖ్య మంత్రి పదవి కూడా ఉంటుంది. దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు. ఒకవేళ విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనకు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాయకులు, ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇప్పుడు విశాఖ అంశంపై ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉన్నాయి. విభజన హామీల కోసం గట్టిగా నోరెత్తని ఈ పార్టీలు ఇక కేంద్ర పాలిత అంశంపై కేంద్రంపై పోరాటం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఇక్కడ పార్టీలు తలోగ్గాలిసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ వైసీపీ, టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ALSO READ : Ap News: బదిలీల్లో అడ్డదారులు.. ఇదేంటి గురువులూ!


Next Story

Most Viewed