Visakha: చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు.. బీజేపీ హైకమాండ్‌పై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Visakha: చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు..  బీజేపీ హైకమాండ్‌పై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ టీడీపీ ట్రాప్‌లో పడిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ట్రాప్‌లో పడిందని ఆయన చెప్పారు.పసుపు కండువాను మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వారి మాటలను అమిత్ షా నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసిందో ముందు చెప్పాలని, అలా కాకుండా వైసీపీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు ఏపీకి ఏం చేశారో...ఎంత నిధులు వెచ్చించారో చెప్పితే బాగుండేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో దానిపై కూడా జేపీ నడ్డా, అమిత్ షాలు సమాధానం చెప్తే బాగుండేదన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 20 లోక్‌సభ సీట్లు కావాలని అమిత్ షా అడుగుతున్నారని ధ్వజమెత్తారు. హోంమంత్రి అమిత్‌షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలేనని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. వారంతా పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేయడం ఏమాత్రం సరికాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed