మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. నిందితుడిని ఉరి తీయాలని తండ్రి డిమాండ్

by Ramesh Naini |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాక మౌనిక హత్య కేసులో.. దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయింది.

మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. నిందితుడిని ఉరి తీయాలని తండ్రి డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాక మౌనిక హత్య కేసులో.. దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మంగళవారం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మౌనిక తండ్రి వేణుగోపాల్ కన్నీరుమున్నీరుగా జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి వేణుగోపాల్ నిందితుడిపై తీవ్ర స్థాయికి ధ్వజమెత్తారు. ఈ కేసుకు సంబంధించి ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెను కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన నిందితుడు చింతాడ రవీంద్రను జీవితాంతం జైలులో పెట్టి ఉరితీయాలని తండ్రి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

హత్యకు కారణం అదే?

మౌనికను హత్య చేసిన సమయంలో ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారం కనిపించకుండా పోయిందని ఆయన ఆరోపించడం కేసులో కొత్త మలుపు తిరిగింది. మౌనిక తన వద్ద రూ.3.50 లక్షలు తీసుకుందని, బ్లాక్ మెయిల్ చేసిందన్న రవీంద్ర పోలీసుల వద్ద చెప్పిన వాదనను తండ్రి వేణుగోపాల్ కొట్టిపారేశారు. తన కూతురు బ్యాంకులో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసేదని తండ్రి స్పష్టం చేశారు. ఆమె ఇతరుల డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. మౌనిక వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతోనే రవీంద్ర ఆమెను ట్రాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించారు.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అలాగే ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును వేణుగోపాల్ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం గాజువాకలోని ఎల్‌వీ నగర్‌లో నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మౌనిక (29) అనే మహిళను దారుణంగా హ్యత్య చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన విషయం విదితమే.

Next Story