Ap News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడ్డూరం.. హామీలను స్టాంప్ పేపర్‌పై రాసిన అభ్యర్థి

by Disha Web Desk 16 |
Ap News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడ్డూరం.. హామీలను స్టాంప్ పేపర్‌పై రాసిన అభ్యర్థి
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని సమయం హేమంత్ కుమార్ తెలిపారు. అంతేకాదు తాను ఇచ్చిన హామీలపై 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చారు. మాట తప్పితే తనపై కేసు పెట్టవచ్చని హేమంత్ పేర్కొన్నారు. అంతేకాదు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో సాక్షి సంతకం పెట్టించారు. మేనిఫెస్టో వివి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా విడుదల చేయించారు. యాజమాన్యాలకు, తల్లితండ్రులకు భారం కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఫీజులు తగ్గింపు చేయిస్తానని హేమంత అన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇప్పించడానికి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, పోలీస్ శాఖ, జెఎల్, డిఎల్ , జిల్లా గ్రంథాలయాలలో ఉద్యోగాలు, బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇచ్చేలా చూస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని తెలిపారు.

ఎంప్లాయిమెంట్ సెల్స్ ఓపెన్ చేసి ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని హేమంత్ కుమార్ హామీ ఇచ్చారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ వయోపరిమితి 27 సంవత్సరాలకు, ఎస్సై ఉద్యోగ వయోపరిమితి 30 సంవత్సరాలకు పెంచేలా చేస్తామని హామీల్లో పొందుపరిచారు. ఏపీపీఎస్సీ, ఏపీడీఎస్సీ ఉద్యోగ పరిమితి జనరల్ అభ్యర్థులకు 47 సంవత్సరాలకు పెంచాలా కృషి చేస్తామని, 47 సంవత్సరాల వరకు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3000 ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, హోంగార్డులకు తెలంగాణ తరహాలో జీతభత్యాలు పెంచేల కృషి చేస్తానని హేమంత్ హామీనిచ్చారు.

ట్రాఫిక్‌లో పని చేసిన వారికి అదనపు జీతం ఇప్పిస్తూ, వీరు పోలీస్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందడానికి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ పరీక్షలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రతి నియోజకవర్గంలో వసతి కల్పిస్తామని, రిటైర్మెంట్ వయసు దాటిన వృద్ధుల సంక్షేమంపై ప్రభుత్వ అనుమతితో వసతి గృహం కట్టించేలా కృషి చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామన్నారు. నిర్వాసితులకు, ఆర్కాట్ హోల్డర్స్‌కి న్యాయం చేయిస్తామని, ఉత్తరాంధ్రకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేంతవరకు పోరాటం కొనసాగించి, స్థానికులకు ఆర్టికల్ 371 డి ప్రకారం ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా వచ్చేంతవరకు సమస్య విడిచి పెట్టమని, పోలీస్, మీడియా మిత్రుల పిల్లలకు కేజీ నుండి పీహెచ్‌డీ వరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉంటామని హేమంత్ స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చారు.


Next Story