Amarnath: విశాఖ రాజధానికి అనుకూలమా..ప్రతికూలమా?

by Disha Web Desk 16 |
Amarnath: విశాఖ రాజధానికి అనుకూలమా..ప్రతికూలమా?
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ రాజధానికి అనుకూలమా? ప్రతికూలమా? తేల్చి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉంటామని సీఎం జగన్ చెప్పడాన్ని ప్రతిపక్షాలు రకరకాలుగా వక్రీకరిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.విశాఖ రాజధానికి తెలుగుదేశం పార్టీ అనుకూలమా?, వ్యతిరేకమా? అనే అంశంపై స్పష్టత ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని మంత్రి అమర్‌నాథ్ హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో అచ్చంనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంతటి అభివృద్ధి ఎప్పుడైనా చేశారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో 1500 కోట్ల రూపాయలతో మూడు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 3500 కోట్ల రూపాయలతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. విశాఖ నగరాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చని, దీనికి ఏ వ్యవస్థ, ఏ రాజకీయ పార్టీ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచే పాలన సాగిస్తారని, అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వస్తుందని, ఇందులో చంద్రబాబు నాయుడుకి కానీ,ఆ పార్టీ నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదని, రాష్ట్రానికి విశాఖే భవిష్యత్తు అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : AP DEBT: ఒక్కో కుటుంబంపై అప్పు రూ.4.50 లక్షలు

Next Story

Most Viewed